సెస్ వైపు.. నేతల చూపు
ABN , First Publish Date - 2022-09-08T05:56:12+05:30 IST
జిల్లా అధికార పార్టీ నేతలతోపాటు విపక్షాల నేతలకు సెస్ ఎన్నికలు టార్గెట్గా మారాయి. సెస్ నామినేట్ కమిటీకి కోర్టులో చుక్కెదురు కావడం, నవం బరు, డిసెంబరులో ఎన్నికల నిర్వహణకు సంబం ధించిన షెడ్యూల్ను కోర్టులో దాఖలు చేయడం వంటి పరిణామాలతో జిల్లా వ్యాప్తంగా సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం ఎన్నికల హడావుడి మొదలైంది. పార్టీల రహితంగా జరిగే సహకార ఎన్నికల్లో పట్టు నిలుపుకోవడానికి నేతలు దృష్టి సారించారు.
- మొదలైన ఎన్నికల హడావుడి
- హైకోర్టుకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం నిర్వహణ
- నవంబరు 7న నోటిఫికేషన్
- గెలుపు గుర్రాలకే మద్దతు తెలిపేందుకు పార్టీల ఆసక్తి
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
జిల్లా అధికార పార్టీ నేతలతోపాటు విపక్షాల నేతలకు సెస్ ఎన్నికలు టార్గెట్గా మారాయి. సెస్ నామినేట్ కమిటీకి కోర్టులో చుక్కెదురు కావడం, నవం బరు, డిసెంబరులో ఎన్నికల నిర్వహణకు సంబం ధించిన షెడ్యూల్ను కోర్టులో దాఖలు చేయడం వంటి పరిణామాలతో జిల్లా వ్యాప్తంగా సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం ఎన్నికల హడావుడి మొదలైంది. పార్టీల రహితంగా జరిగే సహకార ఎన్నికల్లో పట్టు నిలుపుకోవడానికి నేతలు దృష్టి సారించారు. కోర్టుకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే నవంబరు, డిసెంబరులో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గెలిచే అభ్యర్థులకు మద్దతు ఇచ్చే దిశగా సన్నద్ధం అవుతున్నారు. సెస్ పరిధిలో 12 మండలాలు, రెండు మున్సిపాలిటీలు ఉండగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నియోజకవర్గాల పరిధి కూడా ఉన్నాయి. దీంతో సెస్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా నిలవనున్నాయి. సెస్ చైర్మన్ పదవికి జిల్లా స్థాయిలో గుర్తింపు ఉండడం, మండలాల్లో డైరెక్టర్ పదవి హోదాను పెంచే విధంగా ఉండడంతో సెస్ ఎన్నికలను టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సవాలుగా భావిస్తున్నాయి. రిజర్వేషన్ల ప్రకారం మహిళలకు, ఎస్సీలకు కూడా అవకాశం ఉంటుంది. రిజర్వేషన్లు ఖరారైతే వారి పేర్లు కూడా తెరపైకి రానున్నాయి.
సెస్పై గులాబీ జెండా ఎగిరేనా?
సిరిసిల్ల సెస్పై గులాబీ జెండా ఎగురుతుందా? లేదా అనే సందిగ్ధం కూడా ప్రజల్లో నెలకొంది. సెస్ డైరెక్టర్ పోటీకి బీఫాం వంటివి లేకపోయినా పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావుతో పాటు వేములవాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రమేష్బాబు, బోయినపల్లి మండలంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఇల్లంతకుంట మండలంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఎవరిని సూచిస్తారు? అనే దానిపై చర్చలు కొనసాగుతున్నాయి. ఇటీవల ప్రభుత్వం నియమించిన పర్సన్ ఇన్చార్జి చైర్మన్ గూడూరి ప్రవీణ్, డైరెక్టరుగా నంది శంకర్ సిరిస్లిల నుంచి నియమించగా, తంగళ్లపల్లి నుంచి పూసపెల్లి సరస్వతి, ఇల్లంతకుం నుంచి గుడిసె అయిలయ్యయాదవ్, గంభీరావుపేట నుంచి గౌరినేని నారాయణరావు, ముస్తాబాద్ నుంచి కొమ్ము బాలయ్య, ఎల్లారెడ్డిపేట నుంచి కుంభాల మల్లారెడ్డి, వీర్నపల్లి నుంచి మాడుగుల మల్లేశం, చందుర్తి నుంచి దప్పుల అశోక్, రుద్రంగి నుంచి ఆకుల గంగరాజం, కోనరావుపేట నుంచి దేవరకొండ తిరుపతి, వేములవాడ నుంచి పోలాస నరేందర్, రేగులపాటి చరణ్రావు, వేములవాడ రూరల్ నుంచి ఆకుల దేవరాజం, బోయినపల్లి నుంచి మేడుదుల మల్లేశంను నియమించినా హైకోర్టును ఆశ్రయించడంతో కమిటీ రద్దయ్యింది. ఈసారి జరిగే ఎన్నికల్లో వీరిలో కొందరికి మాత్రమే అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. ఎవరికి అవకాశం లభిస్తుందనేది? చర్చనీయాంశంగా మారింది. సిరిసిల్ల పట్టణం నుంచి ప్రధానంగా మళ్లీ సెస్ చైర్మన్ పదవిని దృష్టిలో పెట్టుకొని సెస్ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, ప్రస్తుతం టీఆర్ఎస్లో తటస్థంగా ఉన్న మాజీ వైస్ చైర్మన్ లగిశెట్టి శ్రీనివాస్తోపాటు పద్మశాలి సామాజిక వర్గంలో చురుకైన పాత్ర పోషిస్తున్న బొల్లి రామ్మోహన్, ఇతర సామాజిక వర్గాల్లోని పలువురు టీఆర్ఎస్ నాయకులు కూడా పోటీకి ముందు వరుసలోకి వస్తున్నారనే చర్చ సాగుతోంది. తంగళ్లపల్లి నుంచి చైర్మన్ పదవిని దృష్టిలో పెట్టుకొని మాజీ చైర్మన్ చిక్కాల రామారావుతోపాటు ప్రస్తుత టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గజభీంకార్ రాజన్న పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. టీఆర్ఎస్ నుంచి ముస్తాబాద్లో కొమ్ము బాలయ్య, ఏనుగు విజయరామరావు, ఏనుగు వేణు, బోయినపల్లి నుంచి కొనకటి లచ్చిరెడ్డి, అనుముల భాస్కర్, మేడుదుల మల్లేశం, కత్తెరపాక కొండయ్య, గంభీరావుపేట నుంచి గౌరినేని నారాయణరావు, పాపగారి వెంకటస్వామిగౌడ్, కమ్మరి రాజారాం, రుద్రంగి నుంచి కేసిరెడ్డి నర్సారెడ్డి, ఆకుల గంగారాం, చందుర్తిలో మ్యాకల ఎల్లయ్య, కోనరావుపేటలో గోపాడి సురేందర్రావు, వేములవాడ రూరల్లో గడ్డం హన్మండ్లు, ఆకుల దేవరాజు, వీర్నపల్లిలో గుగులోతు శ్రీరాంనాయక్, మాడుగుల మల్లేశం, వేములవాడ టౌన్లో పుల్కం రాజు, పోలాస నరేందర్, ఇల్లంతకుంటలో గుడిసె అయిలయ్య, ఎల్లారెడ్డిపేటలో కుంభాల మల్లారెడ్డి, కొండ రమేష్గౌడ్, గొల్లపల్లి నర్సింహరెడ్డి, అందె సుభాష్ పోటీ చేస్తారనే చర్చ సాగుతోంది. మరికొందరు టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేల సూచన మేరకు రంగంలోకి దిగడానికి సిద్ధం అవుతున్నారు. మరోవైపు ఎవరికి వారు అగ్రనాయకులను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
బీజేపీ, కాంగ్రెస్లో అభ్యర్థుల వేట
అధికార పార్టీ అభ్యర్థులకు దీటుగా గెలుపు అభ్యర్థులనే రంగంలో నిలిపి మద్దతు ఇచ్చే దిశగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు సన్నద్ధమవుతున్నారు. అభ్యర్థుల ఎంపికపై పరిశీలనలు జరుపుతున్నారు. సిరిసిల్ల నుంచి బీజేపీలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఆడెపు రవీందర్, సుంకరి బాలకిషన్, ఊరగొండ రాజు పోటీకి ముందుకు వస్తారని భావిస్తున్నారు. తంగళ్లపల్లి నుంచి రేగుల పాటి సుభాష్రావు, ముస్తాబాద్ కార్తీక్రెడ్డి బోయినపల్లి నుంచి ఏనుగుల కనకయ్య, గంభీరావుపేటలో దేవసాని కృష్ణ, రుద్రంగిలో నంద్యాడపు వెంకటేష్, చందుర్తిలో మార్త సత్తయ్య, కోనరావుపేటలో గోపాడి సురేందర్రావు, వేములవాడ రూరల్లో జక్కుల తిరుపతి, గాలిపెల్లి స్వామి, వీర్నపల్లి నుంచి గునుగుల దేవేందర్రెడ్డి, వేములవాడ టౌన్ నుంచి గోపు బాలరాజు, రేగుల మల్లికార్జున్, ఇల్లంతకుంట నుంచి బెంద్రం తిరుపతిరెడ్డి, ఎల్లారెడ్డిపేట నుంచి ముద్దుల బుగ్గారెడ్డి, పొన్నాల తిరుపతిరెడ్డి, సందుపట్ల లక్ష్మారెడ్డి, గుండాడి వెంకటరెడ్డి, కోనేటి సాయిలు పోటీ చేస్తారనే చర్చ జరుగుతోంది. ఇతర పార్టీల నుంచి ఆహ్వానించి సెస్ డైరెక్టర్గా బీజేపీ మద్దతు ఇచ్చి గెలిపించడానికి ఆలోచనలు చేస్తున్నారు. తంగళ్లపల్లి కాంగ్రెస్ నుంచి జాల్గం ప్రవీణ్, ముస్తాబాద్ నుంచి ఎల్ల బాల్రెడ్డి, బోయినపల్లి నుంచి కూస రవీందర్, వన్నెల రమణారెడ్డి, భీంరెడ్డి మహేశ్వర్రెడ్డి, గంభీరావుపేటోల హమీద్, రుద్రంగిలో చెలుకల తిరుపతి, గడ్డం శ్రీనివాసరెడ్డి, చందుర్తిలో అంచ శ్రీహరి, కోనరావుపేటలో కేతిరెడ్డి జగన్మోహన్రెడ్డి, వేములవాడ రూరల్లో వకుళాభరణం శ్రీనివాస్, పిల్లి కనకయ్య, సోయినేని కరుణాకర్, వీర్నపల్లి నుంచి బూత శ్రీనివాస్, వేములవాడ టౌన్ నుంచి సాగరం వెంకటస్వామి, ఇల్లంతకుంట నుంచి బద్దం రవీందర్రెడ్డి, ఎల్లారెడ్డిపేట నుంచి దొమ్మాటి నర్సయ్య, షేక్ గౌస్, సద్ది లక్ష్మారెడ్డి పోటీలో నిలుస్తారని చర్చించుకుంటున్నారు. దీంతోపాటు చందుర్తిలో అల్లాడి శ్రీనివాస్ స్వతంత్ర అభ్యర్థిగా రంగలో నిలుస్తారని అతడి వర్గీయులు చెబుతున్నారు. మండలాల్లో కొందరి పేర్లు తెరమీదికిరాగా తెరమీదికి రాకుండానే పోటీలో నిలిచే దిశగా రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.
సెస్ పరిధిలో 2.59 లక్షల మంది ఓటర్లు
సెస్ ఎన్నికల నిర్వహణపై అధికార యంత్రాంగం దృష్టిసారించింది. గతంలో గుర్తించిన ఓటరు జాబితా ప్రకారం 2.59 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఆ సంఖ్య మరో 50 వేలకు పెరగనుంది. 2016లో ఓటు హక్కు ఉన్నా బకాయిలు ఉన్నవారికి ఓటు వేసే వీలు లేకుండా పోయింది. 2019లో ఓటరు జాబితాలో ఫొటో నిబంధన తీసుకొచ్చారు. ఆధార్ అనుసంధానం ప్రక్రియ చేపట్టారు. ఈసారి ఓటరు జాబితాను పూర్తి చేసి ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సెస్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 1970-73లో చైర్మన్గా వి.వెంకటరెడ్డి, 1981-84, 1985-1988లో జె.నర్సింగరావు, 1988-1991లో చిక్కాల రామరావు, 2010-2012లో అల్లాడి రమేష్, 2016- 2021లో దోర్నాల లక్ష్మారెడ్డి ఉన్నారు. కొన్ని సందర్భాల్లో పర్సన్ ఇన్చార్జిలను నియమించినా పూర్తిస్థాయిలో పనిచేయలేకపోయారు. ఎన్నికల ద్వారానే పూర్తిస్థాయిలో పాలకవర్గం కొనసాగనుండడంతో వివిధ మండలాల్లో సెస్ ఎన్నికల సందడి మొదలైంది.