కేసీఆర్ పాలనలో తెలంగాణ ఆగమైంది
ABN , First Publish Date - 2022-11-17T00:03:36+05:30 IST
కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఆగమైందని వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల విమర్శించారు. బుధవారం తిమ్మాపూర్ నుంచి ముంజంపల్లి మీదుగా మానకొండూర్ వరకు షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర నిర్వహించారు.
కేసీఆర్ పాలనలో తెలంగాణ ఆగమైంది
మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి కనిపించడం లేదు
నమ్మి ఓటు వేస్తే రౌడి అయ్యాడు
వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల
మానకొండూర్, నవంబరు 16: కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఆగమైందని వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల విమర్శించారు. బుధవారం తిమ్మాపూర్ నుంచి ముంజంపల్లి మీదుగా మానకొండూర్ వరకు షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మానకొండూర్ నిర్వ హించిన వైఎస్ షర్మిల మాట్లాడారు. కేసీఆర్ పాలన ఫాంహౌస్కే పరిమితమైందని, కేసీఆర్ ఆవినీతిపై కాంగ్రెస్, బీజేపీ ప్రశ్నించకపోవడం సిగ్గు చేటన్నారు. గొర్రెలు, బర్రెలను పంపిణీ చేస్తూ ప్రజలను కులవృత్తులకే పరిమితం చేస్తున్నాడని విమ ర్శించారు. ఎమ్మెల్యేల కొనుగోలు పేరుతో కొత్త సినిమాకు తెరలేపి మొసలి కన్నీళ్లు కారుస్తున్నాడన్నారు. ఎమ్మెల్సీ కవితను బీజేపీ కొనుగోలు చేయాలని ప్రయత్నించిందని చెబితే తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. స్మార్ట్సిటీ ద్వారా ఎన్ని కోట్లు తెచ్చారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం విభజన హమీలను ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. బండి సంజయ్కు నిజాయితీ ఉంటే, కమీషన్లు తీసుకోకపోతే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ చేయించాలని సవాల్ విసిరారు. మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిసన్ కనిపించడం లేదని, ఎక్కడున్నా పోలీసులు వెతికి తీసుకురావాలని సూచించారు. నమ్మి ఓటేస్తే రౌడీలాగా ప్రవర్తిస్తున్నాడని, రైసుమిల్లులు, ప్రాజెక్టుల్లో కమీషన్లు ఇస్తేనే పనులు జరుగుతున్నాయని విమర్శించారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నియోజకవర్గంలో దళితులకు చేసింది ఏమీలేదన్నారు. అనంతరం మండలంలోని ఈదులగట్టెపల్లి వరకు పాదయాత్ర నిర్వహించి రాత్రి బస చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి దుబ్బ నీరజ, కో ఆర్డినేటర్ రాజేశ్వర్రావు, గోపు మహిపాల్రెడ్డి పాల్గొన్నారు. యాత్రకు సీఐ రాజ్కుమార్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు.
సంక్షేమ పాలన కోసమే పార్టీ పెట్టా
తిమ్మాపూర్: తెలంగాణ ప్రజలకు సంక్షేమ పాలన అందించేందుకే పార్టీ పెట్టానని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర బుధవారం ఉదయం పరిధిలో గల అలుగునూర్ నుంచి ప్రారంభమైంది. తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండీ, తిమ్మాపూర్, పోరండ్ల గ్రామాల మీదుగా మానకొండూర్ మండలం ముంజంపల్లి గ్రామంలోకి ప్రవేశించింది. ఈ సందర్భం గా ఆమె మాట్లాడుతూ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారన్నారు. అన్ని వర్గాలనూ కడుపులో పెట్టి చూసుకున్నా రని తెలిపారు. తెలంగాణలో ఎని మిది సంవత్సరాలుగా కేసీఆర్ అడింది ఆటగా, పాడింది పాటగా సాగుతోందన్నారు. ప్రశ్నించవలసిన ప్రతిపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్ మొద్దునిద్రపోతున్నాయని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్ టీపీ జిల్లా అధ్యక్షుడు అక్కనపల్లి కుమార్, కరీంనగర్ పార్లమెంట్ ఇన్చార్జి కంది వెంకట రమణారెడ్డి పాల్గొన్నారు.