రాజీవ్ స్వగృహ భూముల వేలంపాటలకు స్పందన
ABN , First Publish Date - 2022-03-16T06:00:04+05:30 IST
రామగుండం రాజీవ్ రహదారి పక్కనే ఉన్న రాజీవ్ స్వగృహలో ఉన్న ప్రభుత్వ భూముల వేలం పాటలకు భారీస్పందన లభించింది.
- తొలిరోజే రూ.10.79కోట్ల ఆదాయం
- అత్యధికంగా చదరపు గజానికి రూ.13600
కోల్సిటీ, మార్చి 15: రామగుండం రాజీవ్ రహదారి పక్కనే ఉన్న రాజీవ్ స్వగృహలో ఉన్న ప్రభుత్వ భూముల వేలం పాటలకు భారీస్పందన లభించింది. ప్లాట్లు దక్కించుకునేందుకు ఔత్సాహికులు పోటీ పడ్డారు. మొదటి రోజు రూ.10.79కోట్ల మేర ఆదాయం సమకూరింది. కలెక్టర్ సంగీతసత్యనారాయణ, అదనపుకలెక్టర్ లక్ష్మీనారా యణ ఆధ్వర్యంలో స్థానిక సింగరేణి ఆర్జీ-1 కమ్యూనిటీహాల్లో వేలం పాటలు నిర్వహించారు. మొదటి రోజు మూడు కమర్షియల్ ప్లాట్లతో పాటు 33 రెసిడెన్షియల్ ప్లాట్లకు వేలం వేశారు. మొత్తం 221మంది వేలం పాటల్లో పాల్గొన్నారు. కనిష్టంగా చదరపు గజానికి రూ.6100 పలుకగా గరిష్టంగా రూ.13600 పలికింది. మూడు క మర్షియల్ ప్లాట్లలో కనిష్టంగా రూ.6100, గరిష్టంగా రూ.8వేలు పలి కింది. రెసిడెన్షియల్ ప్లాట్లలో గరిష్టంగా సీ క్యాటగిరిలో 150చదరపు గజాల స్థలానికి రూ.13600కు వేలం పాడారు. ఈ ప్లాట్కు ప్రభు త్వం నిర్ణయించిన ధర రూ.4500 కాగా వేలం పాటలో రూ.13600 పలికింది. సరాసరిగా చదరపు గజానికి రూ.9200ధర పలికినట్టు అధికారులు పేర్కొంటున్నారు. కమర్షియల్ ప్లాట్ల కంటే రెసిడెన్షియ ల్ ప్లాట్లు ఎక్కువ ధర పలుకడం చర్చనీయాంశం అయ్యింది. ఉద యం 11గంటల నుంచి సాయంత్రం 7గంటల వరకు ఈ వేలంపా టలు జరిగాయి. కాగా వేలం పాటల్లో పాల్గొన్న కొందరు కావాలనే రేట్లు పెంచారనే ఆరోపణలు కూడా వచ్చాయి. గతంలో రాజీవ్ స్వగృహలో ప్లాట్లు ఉన్నవారు బినామీ పేర్లతో రేటు పెంచించి వది లిపెట్టినట్టు పలువురు బిడ్డర్లు ఆరోపిస్తున్నారు. కాగా బుధవారం 200 చదరపు గజాలుగల బీ టైపు 29, 100చదరపు గజాలుగల ఈ డబ్ల్యూఎస్ 24ప్లాట్లకు వేలం పాటలు జరుగనున్నాయి. ఈ వేలం పాటల్లో రాజీవ్స్వగృహ జీఎం వేణుగోపాల్రెడ్డి, టీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్ అజ్మీర స్వామి, రామగుండం తహసీల్దార్ శ్రీనివాస్, అంత ర్గాం తహసిల్దార్ సంపత్ పాల్గొన్నారు. వేలంపాటల సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్, వన్టౌన్ సీఐలు రమేష్బాబు, రాజ్కుమార్గౌడ్, రామ గుండం సీఐ లక్ష్మీనారాయణ బందోబస్తు పర్యవేక్షించారు.