కార్మిక సంఘాల ఐక్యతతోనే సమస్యలు పరిష్కారం

ABN , First Publish Date - 2022-04-24T05:32:26+05:30 IST

కార్మిక సంఘాల ఐక్యతతోనే 9డిమాండ్లు సాధించామని జాతీయ సంఘాలతో పాటు, టీబీజీకేఎస్‌ మూడు రోజుల పాటు సమ్మె నిర్వహించడం వల్ల సమస్యలు పరిష్కారమయ్యాయని ఐఎన్‌టీయూసీ ప్రధాన కార్యదర్శి బీ జనక్‌ ప్రసాద్‌ అన్నారు.

కార్మిక సంఘాల ఐక్యతతోనే సమస్యలు పరిష్కారం
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న జనక్‌ ప్రసాద్‌

- ఐఎన్‌టీయూసీ ప్రధాన కార్యదర్శి జనక్‌ ప్రసాద్‌ 

గోదావరిఖని, ఏప్రిల్‌ 23: కార్మిక సంఘాల ఐక్యతతోనే 9డిమాండ్లు సాధించామని జాతీయ సంఘాలతో పాటు, టీబీజీకేఎస్‌ మూడు రోజుల పాటు సమ్మె నిర్వహించడం వల్ల సమస్యలు పరిష్కారమయ్యాయని ఐఎన్‌టీయూసీ ప్రధాన కార్యదర్శి బీ జనక్‌ ప్రసాద్‌ అన్నారు. శనివారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో గుర్తింపు సంఘం, ప్రాతినిధ్య సంఘాలను మాత్రమే చర్చలకు పిలిచేవారని, కానీ ఇప్పుడు యాజమాన్యం జాతీయ సంఘాలు, గుర్తింపు సంఘంతో జరిపిన చర్చల్లో ఐఆర్‌ పాలసీని తీసుకువచ్చిందని, ఐఆర్‌ పాలసీతో అన్నీ యూనియన్లను చర్చలకు ఆహ్వానించి సమస్యలు పరిష్కరించాలని, ఐఆర్‌ పాలసీ తప్పకుండా పాటించాలన్నారు. సింగరేణిలో నాలుగు బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను విరమించుకోవాలని, బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ చేయవద్దంట మే మొటి వారంలో కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి దగ్గరకు తీసుకెళతామని యాజమాన్యం హామి ఇచ్చినట్టు చెప్పారు. బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరణ చేస్తే ఐఎన్‌టీయూసీ ఊరుకోదని, ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఒరిస్సాలోని నైని బ్లాక్‌ను సింగరేణి యాజమాన్యం గత ఐదు సంవత్సరాలుగా గని తవ్వకాన్ని ప్రారంభించిందని, అక్కడ ఫారెస్ట్‌ భూ సేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అమలు చేసి ఈ ఏడాది 2.5మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించిందని, నైనీ బ్లాకును కూడా ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయని, నైనీ బ్లాక్‌ సింగరేణి బంగారమని, దానిని వదులుకుంటే సింగరేణి నష్టపోవాల్సి వస్తుందన్నారు. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు అన్నీ కార్మిక సంఘాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో ఐఎన్‌టీయూసీ నాయకులు గుమ్మడి కుమారస్వామి, సమ్మయ్య, లక్ష్మీపతిగౌడ్‌, సదాననందం, గడ్డం కృష్ణ, గుండేటి శ్రీనివాస్‌, జగన్‌, సమ్మయ్య, సాగర్‌, గడ్డం తిరుపతి, తాటిపండు రాజయ్య, పవన్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-04-24T05:32:26+05:30 IST