కరీంనగర్లో నుమాయిష్కు సన్నాహాలు
ABN , First Publish Date - 2022-10-13T04:35:38+05:30 IST
హైదరాబాద్ తరహాలో కరీంనగర్లో నుమాయిష్ను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్ తర్వాత కరీంనగర్లో అదేస్థాయిలో నుమాయిష్ నిర్వహించాలనే లక్ష్యంతో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులతో చర్చించేందుకు ఆహ్వానించారు.
- నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులతో ఏర్పాట్లపై చర్చలు
- హైదరాబాద్ తరహాలో నిర్వహించేందుకు మంత్రి గంగుల ప్రణాళిక
కరీంనగర్ టౌన్, అక్టోబరు 12: హైదరాబాద్ తరహాలో కరీంనగర్లో నుమాయిష్ను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్ తర్వాత కరీంనగర్లో అదేస్థాయిలో నుమాయిష్ నిర్వహించాలనే లక్ష్యంతో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులతో చర్చించేందుకు ఆహ్వానించారు. బుధవారం నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు మినిస్టర్ క్వార్టర్స్లో మంత్రి గంగుల కమలాకర్ను, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ను కలిసి నుమాయిష్ ఏర్పాట్లపై చర్చించారు. 82 ఏళ్ల చరిత్ర కలిగిన నుమాయిష్ ఇప్పటి వరకు హైదరాబాద్ నాంపల్లి గ్రౌండ్స్లో మాత్రమే నిర్వహిస్తున్నారు. మొదటిసారిగా హైదరాబాద్ వెలుపల కరీంనగర్లో నిర్వహించేందుకు మంత్రి గంగుల కమలాకర్ ప్రణాళిక రూపొందించారు. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు హైదరాబాద్లో నుమాయిష్ నిర్వహించిన అనంతరం కరీంనగర్లో నిర్వహించాలని ఆలోచిస్తున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు.