వైభవంగా నృసింహుడి కల్యాణం
ABN , First Publish Date - 2022-03-16T05:47:55+05:30 IST
ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి కల్యాణోత్సవం మంగళవారం సాయంత్రం కన్నుల పండువగా జరిగింది.
తిలకించిన వేలాది మంది భక్తులు
పట్టు వస్ర్తాలు సమర్పించిన కలెక్టర్
ధర్మపురి, మార్చి 15: ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి కల్యాణోత్సవం మంగళవారం సాయంత్రం కన్నుల పండువగా జరిగింది. భారీగా తరలి వచ్చిన వేలాది మంది భక్తులు గోదావరి నదిలో స్నానాలు ఆచరించి ఆలయానికి చేరుకున్నారు. కల్యాణోత్సవం పురస్కరించుకుని లక్ష్మీ నృసింహ స్వామి, శ్రీ వేంకటే శ్వర స్వామి వారల ఉత్సవ మూర్తులను సాయంత్రం ఆలయ వేద పండితులు బొజ్జ రమేష్శర్మ తదితర వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛారణల మధ్య అర్చకులు ఆలయాల నుంచి బయటకు తీసుక వచ్చారు. మంగళ వాయిద్యాలు వెంట రాగా అర్చకులు ఉత్సవ మూర్తులను శేషప్ప కళా వేదిక పైన ఆశీనులు చేశారు. యజ్ఞాచార్యులు కందాలై పురుషోత్తమాచార్య ఆధ్వర్యంలో, వేద పండితులు కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు స్వామి వారలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పురాణ ప్రవచకులు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి, పలువురు పండితులు ఉత్సవ తీరు గురించి ప్రత్యక్ష వ్యాఖ్యానం చేశారు. అంతకు ముందు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీమణి, ఎల్ఎం కొప్పుల చారిటబుల్ ట్రస్టు అధ్యక్షురాలు కొప్పుల స్నేహలత వేర్వేరుగా పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. మున్సిపల్ పక్షాన కమిషనర్ రమేష్, చైర్పర్సన్ సంగి సత్యమ్మ, పట్టు వస్త్రాలు, తలంబ్రాలు తీసుకవచ్చారు. జగిత్యాల డీఎస్పీ రత్నాపురం ప్రకాశ్ ఆధ్వర్యంలో ధర్మపురి సీఐ బిళ్ల కోటేశ్వర్, ఎస్ఐ కిరణ్కుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ డీఎస్ లత, ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్ పాల్గొన్నారు.
కలెక్టర్ పట్టు వస్త్రాలు సమర్పణ
స్వామి వారల కల్యాణోత్సవానికి ప్రభుత్వ పక్షాన కలెక్టర్ గుగులోతు రవి దంపతులు మంగళవారం పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కలెక్టర్ దంపతులకు, జగిత్యాల ఆర్డీవో మా ధురి, అధికారులకు ఆలయ ఈవో, సిబ్బంది ఘనంగా సాగతం పలికారు. కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు నెత్తి మీద పెట్టుకుని ఆలయానికి చేరుకున్నారు. అనంతరం స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు జరిపి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు స్వామి వారలకు సమర్పిం చారు. ఆలయ వేదపండితులు బొజ్జ రమేష్శర్మ, సామవేద పండితులు ముత్యాలశర్మ వారిని ఘనంగా ఆశీర్వదించారు. ఆలయ ఈవో శ్రీనివాస్ కలెక్టర్ దంపతులకు స్వామి శేష వస్త్రాలు కప్పి, ప్రసాదాలు బహుకరించారు.
ఘనంగా స్వామి వారల ఎదుర్కోళ్లు
బ్రహ్మోత్సవాల్లో స్వామి వారల ఎదుర్కోలు కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. కళ్యాణోత్సవానికి ముందు ఆలయ ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసాచారి ఇంటికి సేవలపై అమ్మవారలను, స్వామి వారల ఉత్సవ మూర్తులను తీసుక వచ్చారు. అర్చకుల ఇళ్లలో ప్రత్యేకంగా అలంకరణ చేసిన వేదికపై ఆశీనులు చేసిన ఉత్సవ మూర్తులకు ఆలయ అభిషేక్ పౌరోహితులు ్జ సంపత్కుమార్, సంతోష్కుమార్, రాజగోపాల్ శాస్త్రోక్తంగా పూజలు జరిపి ఎదుర్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు.