గడీల పాలనకు చరమగీతం పాడుతాం
ABN , First Publish Date - 2022-03-16T05:38:00+05:30 IST
గడీల పాలనకు చరమగీతం పాడడమే బహుజన సమాజ్ పార్టీ లక్ష్యమని బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి దొడ్డె సమ్మయ్య అన్నారు.
- బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి దొడ్డె సమ్మయ్య
సుభాష్నగర్, మార్చి 15: గడీల పాలనకు చరమగీతం పాడడమే బహుజన సమాజ్ పార్టీ లక్ష్యమని బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి దొడ్డె సమ్మయ్య అన్నారు. మంగళవారం నగరంలోని ఫిలింభవన్లో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు నిషాని రాంచంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన కాన్షీరాం జయంతి సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో నూటికి 85 శాతం ఉన్న పేదలు అన్ని రంగాల్లో వెనకబడి ఉన్నారని, అందుకు రాజకీయాధికారం లేకపోవడమే కారణమన్నారు. కాన్షీరాం ప్రజలకు ఓటు విలువచెప్పి వారిలో రాజకీయ చైతన్యం నింపి బహుజనులకు రాజ్యాధికారం సాధించి పెట్టారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దొరలపాలన కొనసాగుతోందని విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాలని ఉద్యమం చేసి అధికారంలోకి వచ్చాక గొర్లు, బర్లు, చేపలు అని ప్రజలను కుల వృత్తుల వైపు నెట్టేసి రాజకీయ చైతన్యానికి దూరం చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో బహుజన రాజ్యాధికార సాధనే లక్ష్యంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ కృషి చేస్తున్నారని అన్నారు. దొరల రాజ్యం కూల్చి బహుజన రాజ్యం స్ధాపించినప్పుడే కాన్షీరాంకు నిజమైన నివాళులర్పించిన వారమవుతామన్నారు. అంతకుముందు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మాతంగి అశోక్, జిల్లా మహిళా కన్వీనర్లు జన్ను స్వరూప, అక్కెనపల్లి శిరీష, జిల్లా ఉపాధ్యక్షుడు శీలం రాజయ్య, ప్రధాన కార్యదర్శి నల్లాల రాజేందర్, కోశాధికారి ఉల్లెందుల మహేశ్, కార్యదర్శులు ఏనుగుల లింగయ్య, బోనగిరి ప్రభాకర్, పల్లె ప్రశాంత్గౌడ్, శ్రీనివాస్యాదవ్, మంద రవీందర్, పాతర్ల రాజు, నాయకులు సందుపట్ల మల్లేశం, మాంకాలి తిరుపతి, నల్లాల శ్రీనివాస్, గాలి అనిల్కుమార్, బామండ్ల ప్రమీల, మీసాల సుజాత, నలువాల జమున, అరుణ, జ్యోతి, నిషాని సుమలత, లింగాల శారద, స్వప్న, అనూష పాల్గొన్నారు.