-
-
Home » Telangana » Karimnagar » KCR divided Karimnagar district into four-NGTS-Telangana
-
కేసీఆర్ కరీంనగర్ జిల్లాను నాలుగు ముక్కలు చేశాడు..
ABN , First Publish Date - 2022-08-31T06:03:59+05:30 IST
ముఖ్యమంత్రి కేసీఆర్ సెంటిమెంట్ జిల్లా అయిన కరీంనగర్ను నాలుగు ముక్కలు చేసి సర్వనాశనం చేశాడని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం విమర్శించారు.

- ప్రపంచంలోనే అతిచెత్త ప్రాజెక్టు ‘కాళేశ్వరం’
- ఒకటో తారీఖుకు జీతాలు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితి టీఆర్ఎస్ ప్రభుత్వానిది
- బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం
గణేశ్నగర్, ఆగస్టు 30: ముఖ్యమంత్రి కేసీఆర్ సెంటిమెంట్ జిల్లా అయిన కరీంనగర్ను నాలుగు ముక్కలు చేసి సర్వనాశనం చేశాడని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం విమర్శించారు. మంగళవారం కరీంనగర్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ ఎనిమిదిన్నర ఏళ్ల పాలనలో కరీంనగర్ జిల్లాకు ఏమీ చేయలేదన్నారు. పెద్దపల్లి సభలో కేసీఆర్ ముసలి కన్నీరు కార్చారని, ఆయన మాయమాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి సభలో ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వేయడం పెంచి ప్రపంచంలోనే అద్భుత ప్రాజెక్టు నిర్మాణం చేశామని చెప్పుకునే కేసీఆర్ ఇప్పుడు కాళేశ్వరం గురించి ఎందుకు మాట్లాడడం లేదన్నారు. ఎంతోమంది మేధావులు, ఇంజనీర్లు కాళేశ్వరం తప్పిదాల గురించి హెచ్చరించినా కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదని, ఇప్పడు ప్రాజెక్టుకు ఎలాంటి గతి పట్టిందో ప్రజలందరూ చూశారని తెలిపారు. ప్రపంచంలోనే అతి చెత్త ప్రాజెక్టు కాళేశ్వరం అని విమర్శించారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని, ఒకటో తారీకున ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితిలో కేసీఆర్ ప్రభుత్వం ఉందని ఆయన మండిపడ్డారు. లిక్కర్ అమ్ముకుంటే కానీ ప్రభుత్వం నడవలేని దుస్థితిలో కేసీఆర్ సర్కార్ ఉండడం సిగ్గుచేటన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి, ఆ బురదను బీజేపీకి అంటగట్టాలనుకోవడం కేసీఆర్ మూర్ఖత్వం అన్నారు. కేసీఆర్ సర్కార్ అనేక చిక్కుల్లో ఉందని, లిక్కర్ ఆరోపణలు, ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేకత కప్పి పుచ్చుకోవడానికి రోజుకో నాటకం ఆడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వాన్ని ఎవరూ ప్రశ్నించకూడదనే రీతిలో కేసీఆర్ వ్యవహరిస్తున్నారని, పోలీసులను అడ్డం పెట్టుకొని కేసీఆర్ ఎన్నాళ్లు ఇలాంటి రాజ్యాన్ని నడుపుతారని అన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని సర్వనాశనం చేస్తున్న కేసీఆర్ కుటుంబ పాలనను గద్దె దింపడానికి, తెలంగాణలో ప్రజల కష్టసుఖాలను తెలుసుకోవడానికి, ప్రజల సమస్యల పరిష్కారానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర చేపడితే ప్రభుత్వనికి వణుకు మొదలైందన్నారు. అందుకే బండి సంజయ్కుమార్ను ఓర్వలేకపోతున్నారని, ఆయనపై ఇష్టం వచ్చినట్లు అడ్డగోలుగా మాట్లాడడం వారి సంస్కారానికి నిదర్శనంలాంటిదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను ఎనిమిదిన్నర ఏళ్లలో ఏం సాధించాడని జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడని ఆయన ప్రశ్నించారు. అసలు కేసీఆర్కు జాతీయ రాజకీయాల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ను తరిమికొట్టే సమయం దగ్గరల్లోనే ఉందని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు కళ్లెం వాసుదేవరెడ్డి, మేకల ప్రభాకర్యాదవ్, కన్న కృష్ణ, కటకం లోకేశ్, కళ్యాణ్ చంద్ర, మధు, దుబాల శ్రీనివాస్, కార్పొరేటర్లు కొలగాని శ్రీనివాస్, కచ్చు రవి, దుర్శెట్టి అనూప్, అవదుర్తి శ్రీనివాస్, నరహరి లక్ష్మారెడ్డి, మునిగంటి కుమార్, కైలాస నవీన్, సాయి, శ్రీధర్ పాల్గొన్నారు.