పిల్లల్లో ఉన్నత విలువలు పెంపొందించాలి

ABN , First Publish Date - 2022-12-12T00:27:49+05:30 IST

సాహిత్యంలో ప్రస్తుతం పెల్లుబుకుతున్న బాలల అస్తిత్వ సృజన ఓ సరికొత్త విప్లవమని, పిల్లల్లో ఉన్నత విలువలు పెంపొందించాలని నేషనల్‌ బుక్‌ట్రస్టు ప్రతినిధి, కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార గ్రహీత డాక్టర్‌ పత్తిపాక మోహన్‌ పేర్కొన్నారు.

 పిల్లల్లో ఉన్నత విలువలు పెంపొందించాలి
మాట్లాడుతున్న డాక్టర్‌ పత్తిపాక మోహన్‌

కరీంనగర్‌ కల్చరల్‌, డిసెంబరు 11: సాహిత్యంలో ప్రస్తుతం పెల్లుబుకుతున్న బాలల అస్తిత్వ సృజన ఓ సరికొత్త విప్లవమని, పిల్లల్లో ఉన్నత విలువలు పెంపొందించాలని నేషనల్‌ బుక్‌ట్రస్టు ప్రతినిధి, కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార గ్రహీత డాక్టర్‌ పత్తిపాక మోహన్‌ పేర్కొన్నారు. తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో ఆదివారం కొత్తపల్లిలోని సెయింట్‌ జార్జ్‌ ఇంటర్నేషనల్‌ పాఠశాలలో బాల సాహిత్య సదస్సు-కార్యశాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇప్పటి తరం పిల్లలు ఊహలు, ఆకాంక్షలు, ఆవేదనలు, ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సొంత అస్తిత్వాన్ని పతాకం చేసి ఎగురవేస్తున్నారని అన్నారు. భయం వీడి బాల సాహిత్యాన్ని సృజించిన పిల్లలు భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని అన్నారు. తెరవే నిర్వహిస్తున్న సాహిత్య కార్యశాల కృషికి ఫలితంగా పాఠశాల పిల్లలు రాసిన కథా సంకలనం త్వరలోనే ప్రచురించాలని అడిషనల్‌ కలెక్టర్‌ జీవి శ్యాంప్రసాద్‌లాల్‌ అన్నారు. ఆటలు, గ్రంథాలయాలకు సమ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. తెరవే రాష్ట్ర అధ్యక్షుడు గాజోజు నాగభూషణం మాట్లాడుతూ మొబైల్‌ల వాడకంతో విలువైన రేపటి తరం మెదళ్లు మొద్దుబారుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కవి అన్నవరం దేవేందర్‌, విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ ఫాతిమారెడ్డి, కందుకూరి అంజయ్య, బూర్ల వేంకటేశ్వర్లు, కూకట్ల తిరుపతి పలువురు కవులు, రచయితలు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-12T00:27:51+05:30 IST