ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై రైతుల రాస్తారోకో
ABN , First Publish Date - 2022-11-25T00:19:19+05:30 IST
ధాన్యం కోనుగోళ్లలో జాప్యంపై రుద్రంగి మండల కేంద్రంలోని కోరుట్ల-వేములవాడ ప్రధాన రహదారిపై రైతులు గురువారం రాస్తారోకో నిర్వహించారు.
రుద్రంగి, నవంబరు 24: ధాన్యం కోనుగోళ్లలో జాప్యంపై రుద్రంగి మండల కేంద్రంలోని కోరుట్ల-వేములవాడ ప్రధాన రహదారిపై రైతులు గురువారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కేంద్రంలో ధాన్యం పోసి నెల రోజులవుతున్నా సరిగా కోనుగోలు చేయడం లేదని, ఒక్కో కొనుగోలు కేంద్రంలో 100కు పైగా ధాన్యం కుప్పలు మ్యాచర్ వచ్చాయని అన్నారు. కొనుగోలు విషయంలో స్పష్టమైన హామీ ఇచ్చేవరకు రాస్తారోకో విరమించబోమన్నారు. కొందరు రైతులు పురుగుల మందు డబ్బాలతో నిరసన తెలిపారు. చందుర్తి నుంచి కథలాపూర్ వెళ్తున్న చందుర్తి జడ్పీటీసీ నాగం కూమార్ రైతులకు మద్దతుగా రాస్తారోకోలో పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో మాట్లాడి లారీల కొరత లేకుండా చూస్తామని ఎస్సై ప్రభాకర్ హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.