ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో లోడింగ్‌ కార్మికుల తొలగింపు

ABN , First Publish Date - 2022-02-23T06:15:18+05:30 IST

రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌(ఆర్‌ఎఫ్‌సీఎల్‌)లో కొందరు లోడింగ్‌ కార్మికులను తొలగించడం వివాదానికి దారి తీసింది.

ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో లోడింగ్‌ కార్మికుల తొలగింపు
ఆర్‌ఎఫ్‌సీఎల్‌ గేటు ఎదుట బైఠాయించిన కార్మికులు

- పరిశ్రమ ఎదుట ఆందోళనకు దిగిన కార్మికులు

- అదుపులోకి తీసుకున్న పోలీసులు

కోల్‌సిటీ, ఫిబ్రవరి 22: రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌(ఆర్‌ఎఫ్‌సీఎల్‌)లో కొందరు లోడింగ్‌ కార్మికులను తొలగించడం వివాదానికి దారి తీసింది. మంగళవారం మొదటి, రెండవ షిప్టులో కొందరు కార్మికులను నిలిపివేయడంతో కార్మికులు ఆందోళనకు దిగారు. కార్మిక నాయకుడు అంబటి నరేష్‌ ఆధ్వర్యంలో పలువురు లోడింగ్‌ కార్మికులు పరిశ్రమ గేటు ముందు బైఠాయించారు. టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు దాతు శ్రీనివాస్‌, మంచికట్ల దయాకర్‌లు వారికి మద్దతు ప్రకటించారు. పరిశ్రమలో  కార్మికులను తొలగించకూడదని, బకాయిల వేతనాలు చెల్లించాలని, గేట్‌ పాస్‌లు పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌ హెచ్‌ఆర్‌ అధికారులు సోమనాథ్‌, నాగవంశీ, అజయ్‌కుమార్‌ నిరసనకారులతో చర్చలు జరిపారు. కార్మికుల ఎంత మంది అవసరం అనేది కాంట్రాక్టర్‌కు సంబంధించిన విషయమని, యాజమాన్యానికి సంబంధం లేదని పేర్కొన్నారు. తాము మొదట కూడా లోడింగ్‌ పనులు తాత్కాలికమేనని చెప్పుకుంటూ వచ్చామన్నారు. యంత్రాలు పని చేయలేని సమయంలో ఎక్కువ మంది కార్మికులను కాంట్రాక్టర్‌ పనుల్లో పెట్టాడని, ప్రస్తుతం యంత్రాలు పూర్తిస్థాయిలో పని చేస్తున్నాయన్నారు. గత కాంట్రాక్టర్‌ టెండర్‌ కూడా పూర్తయ్యిందని, కొత్త కాంట్రాక్టర్‌ అవసరం మేరకు కార్మికులను తీసుకుంటామని చెబుతున్నాడన్నారు. మొదట ప్రభావిత, పరిసర గ్రామాలు, స్థానికులకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా నిరసన కారులకు, ఆర్‌ఎఫ్‌సీఎల్‌ అధికారులకు వాగ్వాదం జరిగింది. గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్‌ ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నిరసనకారులను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్‌ఎఫ్‌సీఎల్‌ మెయిన్‌ గేట్‌ వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. కొందరిని టుటౌన్‌ స్టేషన్‌కు, మరికొందరిని ఎన్‌టీపీసీ స్టేషన్‌కు తరలించారు. రామగుండం సీఐ లక్ష్మీనారాయణ, ఎన్‌టీపీసీ ఎస్‌ఐ సర్పరాజ్‌ తదితరులు బందోబస్తు నిర్వహించారు. 

Updated Date - 2022-02-23T06:15:18+05:30 IST