బ్రహ్మచారిణి అలంకరణలో అమ్మవారి దర్శనం
ABN , First Publish Date - 2022-09-28T06:18:06+05:30 IST
దక్షిణ కాశీ వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానంలో మంగళవారం రాజరాజేశ్వరీదేవి అమ్మవారు బ్రహ్మచారిణి అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు.
వేములవాడ, సెప్టెంబరు 27 : దక్షిణ కాశీ వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానంలో మంగళవారం రాజరాజేశ్వరీదేవి అమ్మవారు బ్రహ్మచారిణి అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు. శరన్నవరాత్ర్సోవాల్లో రెండో రోజు ప్రత్యేక పూజల్లో భాగంగా ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ నేతృత్వంలో అర్చకులు ఉదయం అమ్మవారికి మహాభిషేకం, లలితా సహస్రనామ సహిత చతుష్షష్ట్యోపచార పూజ, కన్యకాసువాసినీ పూజలను నిర్వహించారు. నాగిరెడ్డి మండపంలో హోమం చేశారు. స్వామివారి కల్యాణమండపంలో వేదపండితులు వేద పారాయణం, సాయంత్రం శ్రీదేవి భాగవతం పురాణ ప్రవచనం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు అందుకుంటున్న అమ్మవారిని, స్వామివారిని భక్తులు దర్శించుకొని తరించారు.
వేములవాడ దివ్యక్షేత్రంలో పార్వతీ రాజరాజేశ్వరస్వామి, శ్రీలక్ష్మి అనంతపద్మనాభస్వామివారలు మంగళవారం రాత్రి నెమలి వాహనంపై విహరించారు. శరన్నవరాత్ర్సోవాల్లో భాగంగా రెండవ రోజు ఉదయం, సాయంత్రం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాత్రి అందంగా అలంకరించిన నెమలి వాహనంపై స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఆలయ ఆలయ అధికారులు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.