మారనున్న పాఠశాలల రూపురేఖలు
ABN , First Publish Date - 2022-02-23T06:41:52+05:30 IST
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున్నాయని కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.
- కలెక్టర్ అనురాగ్ జయంతి
వీర్నపల్లి, ఫిబ్రవరి 22 : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున్నాయని కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. వీర్నపల్లి మండల కేంద్రంతోపాటు గర్జనపల్లి, రంగంపేట, అడవిపదిర, వన్పల్లి గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలల్లో 12 అంశాలైన తాగునీరు, కిచెన్ షెడ్ల నిర్మాణం, డైనింగ్ హాల్, మరమ్మతులు, విద్యుత్, మరుగుదొడ్లు, ఫర్నీచర్, పెయింటింగ్, గ్రీన్ చాక్బోర్డులు, ప్రహరీ, తరగతి గదుల నిర్మాణం, డిజిటల్ విద్య అమలుపై నివేదికలు తయారు చేయాలని సూచించారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా సర్కార్ బడులను బలోపేతం చేయాలన్నారు. కార్యక్రమంలో డీపీవో రవీందర్, డీఆర్డీవో కౌటిల్యరెడ్డి, డీఈవో రాధాకిషన్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ఎడ్ల సాగర్, సర్పంచులు లింగం, కరుణ, లత, ఎంపీడీవో భారతి, ఎంపీవో సురేష్, ఏపీవో శ్రీహరి ఉన్నారు.
కంపోస్ట్ షెడ్ను పరిశీలించిన కలెక్టర్
వీర్నపల్లి మండలం అడవిపదిర గ్రామంలోని కంపోస్టు షెడ్, వైకుంఠధామం, వన్పల్లి గ్రామంలోని నర్సరీ, కంపోస్ట్ షెడ్, వైకుంఠధామాన్ని కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. విక్రయించిన వ్యర్థాల వివరాలను రిజిస్టర్లో పొందుపర్చాలని సూచించారు. వైకుంఠధామాల వినియోగంపై దృష్టి సారించాలన్నారు. నర్సరీలో మొక్కల సంరక్షణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నర్సరీలో 25 వేల మొక్కలు పెంచుతున్నట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు.