గర్రెపల్లిలో కేంద్ర బృందం పర్యటన

ABN , First Publish Date - 2022-07-18T05:56:22+05:30 IST

ఉపాధిహామీ పథకం ద్వారా గ్రామాలలో పూర్తి చేసిన పలు అభివృద్ధి పనులను ఆదివారం కేంద్ర అధికారుల బృం దం పరిశీలించింది.

గర్రెపల్లిలో కేంద్ర బృందం పర్యటన
గర్రెపల్లిలో చెత్త నిర్వహణ యూనిట్‌లో నాసిరకం పనులను చూపుతున్న సెంట్రల్‌ టీం లీడర్‌ దేవేందర్‌కుమార్‌

- ఈజీఎస్‌ పనులను పరిశీంచిన అధికారులు

- నాసిరకం పనుల గుర్తింపు

సుల్తానాబాద్‌, జూలై 17 : ఉపాధిహామీ పథకం ద్వారా గ్రామాలలో పూర్తి చేసిన పలు అభివృద్ధి పనులను ఆదివారం కేంద్ర  అధికారుల బృం దం పరిశీలించింది. అయితే వీరి పరిశీలనలో పలు పనులు నాసిరకంగా, నాణ్యతా లోపంతో ఉన్నాయని బృందం గుర్తించింది. ఈ మేరకు నాణ్యతా లోపం గురించి అధికారులు, ప్రజాప్రతినిధులను ఆరా తీశారు. మండం లోని గర్రెపల్లి గ్రామంలో ఆదివారం కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారి దేవేందర్‌ కుమార్‌ ఆధ్వర్యంలో రక్షిత్‌త్యాగి, పలువురు అధికారులు గర్రెపల్లి గ్రామంలో పర్యటించారు. ముందుగా గ్రామపంచాయతీ కార్యాలయంలో సమావేశమై గ్రామంలో ఉపాధిహామీ పథకంతో పాటు కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో చేపట్టిన పను ల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలోని పెద్ద చెరువు వద్ద నిర్మించిన తడిచెత్త, పొడిచెత్త వేరు చేసే చెత్త నిర్వహణ యూనిట్‌ ను పరిశీలించారు. అయితే ఈ పనులు నాసిరకంగా ఉన్నాయని, నాణ్యత లేదని అసలు సిమెంట్‌ వాడకుండా ఇసుక వాడారని అధికారుల బృందం టీంలీడర్‌ దేవేందర్‌ కుమార్‌ అన్నారు. పనులకు సంబంధించిన సైన్‌ బోర్డు కూడా బయట లేకపోవం గమనించి ముందు ఉంచాలన్నారు. ఆ తర్వాత అక్కడే ఉన్న వైకుంఠధామానికి చేరుకుని వాటి పనులను క్షుణ్ణం గా పరిశీలించారు. అనంతరం మృతదేహాలను దహనం చేసే గద్దె వద్దకు వెళ్లి అక్కడ ఇటుకలు బయటకు వచ్చి ఉన్న నిర్మాణం చూసి పనుల్లో నాణ్యతా లేదని అన్నారు. రెండు గద్దెల్లో ఒక దాని కొలతలను కూడా అధికారులు తీసుకుని నిబంధనల మేరకు లేవని అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఈ రెండు సందర్భాలలో ఎంపీపీ బాలాజీరావు జోక్యం చేసుకుని అధికారుల బృందానికి సర్దిచెప్పబోయారు. తర్వాత గొల్లవాడలో నిర్మించిన సీసీ రోడ్డును పరిశీలించి దానికి సంబంధించిన కొలతలను కూడా చూశారు. రోడ్డు నాణ్యతతో ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకా పలు పనులను వారు పరిశీలించారు. కాట్నపల్లి గ్రామంలో పశువు కొట్టాన్ని పరిశీలించారు. ఐతరాజుపల్లి గ్రామంలో కూడా బృందం పర్య టించింది. వారి వెంట పంచాయతీరాజ్‌ కమిషనరేట్‌ కార్యాలయం నుంచి రాష్ట్రస్తాయి అధికారి, జిల్లా ఇన్‌చార్జి మణికంఠేష్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీధర్‌, క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు, ఎంపీపీ బాలాజీరావు, సర్పంచులు వీరగోని సుజాతరమేష్‌గౌడ్‌, మోరపల్లి మోహన్‌రెడ్డి, గుజ్జేటి దేవమ్మ ఎంపీటీసీలు పులి అనూష, అనిత, విజయ, ఉప సర్పంచ్‌ అలవే ణి మదుకర్‌, ఎంపీడీఓ శశికళ, ఈజీఎస్‌ ఏపీఓ లావణ్య, ఇతర సాంకేతిక అధికారులు కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-18T05:56:22+05:30 IST