కాకతీయ సప్తాహం లోగో ఆవిష్కరణ
ABN , First Publish Date - 2022-07-06T05:12:55+05:30 IST
కాకతీయ సప్తాహం లోగో ఆవిష్కరణ
హైదరాబాద్లో విడుదల చేసిన మంత్రి కేటీఆర్
హనుమకొండ, జూలై 5 (ఆంధ్రజ్యోతి) : కాకతీయ వైభవ సప్తాహం లోగోను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు ఆవిష్కరించారు. ఈనెల 7 నుంచి 13వ తేదీ వరకు ఏడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ సప్తాహం కోసం ప్రత్యేకంగా లోగోను రూపొందించారు. మంగళవారం హైదరాబాద్లో ప్రగతి భవన్లోని తన కార్యాలయంలో మంత్రి ఈ లోగోను విడుదల చేశారు. పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివా్సగౌడ్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఈ సందర్భంగా హాజరయ్యారు. బంగారు వర్ణంలో కాకతీయ కళాతోరణం, మధ్యలో సింహం ఆకారంతో కూడిన కాకతీయుల కీర్తి ముఖం డిజిటలైజ్ శిల్పకళాఖండం, దాని వెనుకభాగాన కాకతీయుల వైభవానికి ప్రతీకగా వెలుగులు చిమ్ముతున్న కిరణాలు, అడుగుభాగాన మెరూన్ రంగు స్ట్రిప్పై కాకతీయ వైభవ సప్తాహం జూలై 7-13-2022 అని రాసిన అక్షరాలతో కళాత్మకంగా లోగోను రూపొందించారు. గతంలో కాకతీయు ఉత్సవాలు నిర్వహించినప్పుడు లోగోలో కీర్తితోరణం మధ్యలో గుర్రంపై రాణి రుద్రమదేవి చిత్రాన్ని ఉంచారు. కానీ కీర్తిముఖం చేర్చడం ఈ సారి ప్రత్యేకత. ఈ శిల్పం అన్ని కాకతీయుల శిల్పాలపైన కనిపిస్తుంది. నంది విగ్రహాలపైన కూడా కనిపిస్తుంది.