మెడికల్ పీజీ ప్రవేశాల్లో ఇన్సర్వీస్ కోటా ఉందా? లేదా?
ABN , First Publish Date - 2022-10-11T10:12:09+05:30 IST
నీట్ మెడికల్ పీజీ ప్రవేశాల్లో తెలంగాణ వైద్య విధాన పరిషత్, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వైద్యులకు ఇన్సర్వీస్ కోటా వర్తిస్తుందా
బుధవారం సమాధానం ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు
హైదరాబాద్, అక్టోబర్ 10 (ఆంధ్రజ్యోతి): నీట్ మెడికల్ పీజీ ప్రవేశాల్లో తెలంగాణ వైద్య విధాన పరిషత్, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వైద్యులకు ఇన్సర్వీస్ కోటా వర్తిస్తుందా? లేదా? అనే విషయంపై స్పష్టమైన వైఖరి తెలియజేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. ఈ నెల 12న అడ్వకేట్ జనరల్ విచారణకు వచ్చి ప్రభుత్వ విధానం ఏమిటో స్పష్టం చేయాలని పేర్కొంది. తమకు గ్రామీణ ప్రాంతాల్లో మూడేళ్ల సర్వీసు, గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లు పనిచేసిన అనుభవం ఉందని, అయినప్పటికీ మెడికల్ పీజీ ప్రవేశాల్లో తమకు ఇన్సర్వీస్ రిజర్వేషన్ వర్తింపజేయలేదని డాక్టర్ దినేశ్ కుమార్, మరికొంతమంది వైద్యులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇటీవల విచారణ చేపట్టిన హైకోర్టు.. సోమవారం వరకు సీట్ల కేటాయింపులను పూర్తి చేయవద్దని మధ్యంతర ఆదేశాలు జారీచేసింది.
మళ్లీ సోమవారం ఈ పిటిషన్పై జస్టిస్ అభినందన్కుమార్ షావిలి, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కాళోజీ హెల్త్ యూనివర్సిటీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. జీవో 155 ప్రకారం తెలంగాణ వైద్యవిధాన పరిషత్, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వైద్యులకు గిరిజన, గ్రామీణ ప్రాంతాల సర్వీసు వర్తించదని తెలిపారు. ఈ విభాగాలకు చెందిన వైద్యులు ప్రాంతాలతో సంబంధం లేకుండా 6 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకుని ఉంటే మాత్రమే వారికి ఇన్ సర్వీస్ కోటా వర్తిస్తుందని తెలిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది సామ సందీ్పరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఇలా అయితే గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో ఏ వైద్యుడు పనిచేయరని పేర్కొన్నారు. ఎక్కువ వేతనాలు, ఫీజులు వచ్చే పట్టణ ప్రాంతాల్లోనే అందరూ పనిచేస్తారని పేర్కొన్నారు. వాదనలు నమోదు చేసుకున్న ఽధర్మాసనం.. ఈ నెల 12 వరకు పీజీ మెడికల్ సీట్ల కేటాయింపులను చేపట్టవద్దని తెలిపింది.