ఏపీని తమిళనాడులో కలుపుకోండి
ABN , First Publish Date - 2022-12-10T03:16:15+05:30 IST
ఆంధ్రప్రదేశ్ మళ్లీ ఉమ్మడి రాష్ట్రంగా ఉండాలని కోరుకుంటున్నామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ మండిపడ్డారు.
సజ్జల తెలంగాణపై మాట్లాడుతున్నారెందుకు?
ఎప్పుడో కడతామన్న శంషాబాద్ మెట్రోకు ఇప్పుడు శంకుస్థాపన చేయడమేంటి?: అర్వింద్
న్యూఢిల్లీ, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ మళ్లీ ఉమ్మడి రాష్ట్రంగా ఉండాలని కోరుకుంటున్నామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ మండిపడ్డారు. ‘‘సజ్జల మా తెలంగాణ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు?’’ అని ప్రశ్నించారు. కావాలంటే ఏపీని తీసుకెళ్లి తమిళనాడులో కలిపేసుకోవాలని సూచించారు. ఏపీ సీఎం జగన్ తన సలహాదారుడిని మార్చుకోవాలని అర్వింద్ సలహా ఇచ్చారు. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. శంషాబాద్ దాకా మెట్రో రైల్ నిర్మాణం చేపడతామని సీఎం కేసీఆర్ 2014కు ముందు హామీ ఇచ్చారని, ఇన్నాళ్లకు శంకుస్థాపన చేయడమేంటని ప్రశ్నించారు. కాగా, ఉపాధి హామీ పథకం నిధులను కాళేశ్వరం ప్రాజెక్టుకు మళ్లించినందుకు రూ.152 కోట్లు వెనక్కి ఇవ్వాలంటూ.. కేంద్రం నుంచి కేసీఆర్ సర్కార్కు నోటీసులు అందాయని అర్వింద్ తెలిపారు. ఇది సిగ్గు చేటన్నారు.