ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థుల పోరాటం ఫలించింది

ABN , First Publish Date - 2022-12-10T00:42:42+05:30 IST

పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు చేసిన తప్పిదాలపై ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థులతో బీసీ సంక్షేమం సంఘం చేసిన పోరాటం ఫలించిందని రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య పేర్కొన్నారు.

ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థుల పోరాటం ఫలించింది
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ ఆర్‌.కృష్ణయ్య

  • ఏడు మార్కులు కలపాలని హైకోర్టు తీర్పునివ్వడం హర్షణీయం

  • ఎంపీ ఆర్‌.కృష్ణయ్య

రాంనగర్‌, డిసెంబర్‌ 9 (ఆంధ్రజ్యోతి): పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు చేసిన తప్పిదాలపై ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థులతో బీసీ సంక్షేమం సంఘం చేసిన పోరాటం ఫలించిందని రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య పేర్కొన్నారు. ప్రశ్నాపత్రంలోని మల్టీఫుల్‌లో తప్పుగా వచ్చిన ఏడు ప్రశ్నలకు మార్కులు కలపాలని హైకోర్టు జడ్జి ఇ.వి.వేణుగోపాల్‌ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. అదే ప్రశ్నాపత్రంలో వచ్చిన తొమ్మిది ప్రశ్నలకు గానూ 9 మార్కులకు సంబంధించిన అంశం కోర్టులో కొనసాగుతుందని, ఆ తీర్పు రాకముందే ప్రభుత్వం స్పందించి 9 మార్కులు కలిపి గౌరవాన్ని కాపాడుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. విద్యానగ ర్‌లోని బీసీ భవన్‌లో జరిగిన ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థుల విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుతో 70 వేలమంది అభ్యర్థులు శరీర ధారుఢ్య పరీక్షలకు అర్హత సాధిస్తారన్నారు. అదే విధంగా మరో 9 ప్రశ్నలకు 9 మార్కులు కలిపితే మరో లక్షమందికి అర్హత లభిస్తుందన్నారు. పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు తప్పుడు నిర్ణయాల వల్ల ఆత్మహత్య చేసుకున్న 15 మంది కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ సంఘం నాయకులు ప్రదీప్‌, చందన, రవి మాట్లాడుతూ ఆర్‌.కృష్ణయ్య చేసిన పోరాటం తమకుఎంతో ధైర్యాన్ని ఇచ్చిందన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జకృష్ణ, నాయకులు రాజ్‌కుమార్‌, దీపిక, నీల వెంకటేష్‌, జి.అనంతయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-10T00:42:45+05:30 IST