సభ్యుల పదవీకాలం వివాదం.. బార్ కౌన్సిల్కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు
ABN , First Publish Date - 2022-11-17T02:55:20+05:30 IST
తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుల పదవీకాలం అంశంపై వివరణ ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టు...
హైదరాబాద్, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుల పదవీకాలం అంశంపై వివరణ ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టు... బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ), తెలంగాణ బార్ కౌన్సిల్కు నోటీసులు జారీచేసింది. తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుల రెండేళ్ల పదవీకాలం ముగిసినప్పటికీ అడ్వకేట్స్ యాక్ట్కు విరుద్ధంగా ఇంకా పదవుల్లో కొనసాగుతున్నారని పేర్కొంటూ తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పొన్నం అశోక్గౌడ్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ యశ్వంత్ వర్మ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. చట్ట ప్రకారం కొత్తగా ఏర్పడిన బార్ కౌన్సిల్ సభ్యుల పదవీకాలం రెండేళ్లు మాత్రమేనని, ఈ మేరకు 2020లోనే సభ్యుల పదవీకాలం ముగిసినా ఇంకా కొనసాగుతున్నారని పేర్కొన్నారు. కొత్తగా ఎన్నికైన సభ్యులు ఐదేళ్లు పదవిలో కొనసాగవచ్చని పేర్కొంటూ బీసీఐ ఓ లెటర్ జారీచేసిందని, దీని ఆధారంగా సభ్యులు పదవిలో కొనసాగుతున్నారని తెలిపారు. బీసీఐ లెటర్ను కొట్టేసి.. తెలంగాణ బార్ కౌన్సిల్కు తాజాగా ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు జారీచేయాలని కోర్టును కోరారు. బీసీఐ జారీచేసిన లెటర్ అడ్వకేట్స్ యాక్ట్కు విరుద్ధమని పేర్కొన్నారు. తెలంగాణ బార్ కౌన్సిల్ మొదటిసారి 2018లో ఏర్పడిందని, సభ్యుల పదవీకాలం 2020 వరకు మాత్రమే ఉందని తెలిపారు. వాదనలు నమోదు చేసుకున్న ఽధర్మాసనం.. ఈ అంశంపై వివరణ ఇవ్వాలని బీసీఐ, తెలంగాణ బార్ కౌన్సిల్కు నోటీసులు జారీచేసింది.