ఫిష్ మార్కెట్లో అర్హులకే స్టాళ్లు కేటాయించాలి
ABN , First Publish Date - 2022-11-12T00:42:14+05:30 IST
బేగంబజార్లో నూతనంగా నిర్మించిన మోడ్రన్ చేపల మార్కెట్లో అర్హులైన వారిని గుర్తించి వారికే స్టాళ్లను కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు.
అఫ్జల్గంజ్, నవంబర్ 11 (ఆంధ్రజ్యోతి): బేగంబజార్లో నూతనంగా నిర్మించిన మోడ్రన్ చేపల మార్కెట్లో అర్హులైన వారిని గుర్తించి వారికే స్టాళ్లను కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. శుక్రవారం బేగంబజార్ ఫిష్ మార్కెట్ స్టాల్ నిర్వాహకులు, మాజీ ఎమ్మెల్యే ప్రేమ్సింగ్ రాథోడ్, బేగంబజార్ కార్పొరేటర్ జి.శంకర్ యాదవ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నంద కిశోర్ వ్యాస్ బిలాల్, ఎం.ఆనంద్ కుమార్ గౌడ్ మంత్రితో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాద వ్ మాట్లాడుతూ... బేగంబజార్ ఫిష్ మార్కెట్పైన సుమారు 500 మంది కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నారని... పాత మార్కెట్లో సరైన వసతులు లేకపోవడంతో అక్కడి వ్యాపారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అన్ని సదుపాయాలతో కూడిన జీ ప్లస్-2 పద్ధతిలో రూ. 9.50కోట్ల వ్యయంతో హోల్సేల్, రిటైల్ వ్యాపారాలు నిర్వహించుకునే విధంగా నూతన మోడ్రన్ భవనాన్ని నిర్మించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అక్రమాలకు నిర్మాణాలకు పాల్పడుతున్న వారిని ఉపేక్షించవద్దని... అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ ఏసీపీ అధికారులకు మంత్రి ఆదేశించారు. మిగిలిన చిరు వ్యాపారులను కూడా ఇబ్బందులు గురి కాకుండా ఉండేందుకు గాను కార్పొరేటర్ జి.శంకర్ యాదవ్, నంద కిశోర్ వ్యాస్, ఎం.ఆనంద్ కుమార్ గౌడ్, పూజ వ్యాస్ బిలాల్లు సమన్వయంతో వ్యాపారులకు వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటిని పరిష్కరించి వారికి అండగా నిలువాలన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రవి కిరణ్, డీసీ నాయక్, టౌన్ ప్లానర్ రంజిత్, ఏసీపీ శ్రీనివాస్, ఈఈ ప్రకాశ్, డీఈ సురేశ్ తదితరులు పాల్గొన్నారు.