రాష్ట్రానికి వర్షసూచన.. వణికిస్తున్న చలి
ABN , First Publish Date - 2022-12-10T03:07:36+05:30 IST
రాగల మూడు రోజులు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
కామారెడ్డిలో 5.9 డిగ్రీలు
ఆంధ్రజ్యోతి నెట్వర్క్: రాగల మూడు రోజులు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం నాటి తుపాన్ మౌండ్సగా బలపడిందని పేర్కొంది. ఇది పశ్చిమ వాయువ్యదిశగా కదలి శుక్రవారం ఉదయం బలహీనపడి తుపాన్గా మారిందని వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో కరైకాల్కి 180 కిలోమీటర్ల తూర్పు ఈశాన్య దిశగా, చెన్నైకు 260 కిలోమీటర్ల దక్షిణదిశగా కేంద్రీకృతమై ఉన్నట్లు పేర్కొంది. ఇది వాయువ్య దిశగా కదులుతూ శనివారం మధ్య ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరిని అనుకొని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు దగ్గర ఉన్న శ్రీహరికోట మధ్యన మహాబలిపురం వద్ద తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు తుపాన్ ప్రభావంతో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. చలి తీవ్రత బాగా పెరిగింది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పదిలోపు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో అత్యల్పంగా కామారెడ్డి జిల్లా డోంగ్లీలో 5.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయింది. సంగారెడ్డి జిల్లా న్యాలకల్లో 6.6, ఆదిలాబాద్ జిల్లా పొచ్చరలో 7, బేల, సోనాలలో 7.3, బజార్హత్నూర్లో 7.4, నిర్మల్ జిల్లా భైంసాలో 7.7, ఆదిలాబాద్ జిల్లా రాంనగర్లో 7.8, హబ్సీపూరలో 7.9, కుంటాలలో 8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది .