రేపటి నుంచి ‘ఆపరేషన్ స్మైల్’
ABN , First Publish Date - 2022-12-31T04:20:35+05:30 IST
ఇంటి నుంచి తప్పిపోయి లేదా పారిపోయి అయిన వారందరికీ దూరమై దిక్కుతోచని స్థితిలో బస్టాండ్లు, రైల్వే...
నెలరోజుల పాటు నిర్వహణ
హైదరాబాద్, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఇంటి నుంచి తప్పిపోయి లేదా పారిపోయి అయిన వారందరికీ దూరమై దిక్కుతోచని స్థితిలో బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వంటి ప్రదేశాల్లో తిరుగుతూ బతుకు వెల్లదీస్తున్న చిన్నారులు కొందరైతే, చదువుకునే వయస్సులో బాలకార్మికులుగా మారి వెట్టి చాకిరి చేస్తూ బతుకీడుస్తున్న చిన్నారులు మరికొందరు. అలాంటి పిల్లలను గుర్తించి, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేందుకు నిర్వహించే ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం జనవరి 1న ప్రారంభం కానుంది. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం జనవరి 1 నుంచి నెల రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో హోటళ్లు, పరిశ్రమల్లో పనిచేసే బాలకార్మికుల్ని, బస్టాండుల్లో, రైల్వే స్టేషన్లలో అనాథలుగా ఉన్న చిన్నారులను గుర్తించి వారిని కుటుంబ సభ్యులకు అప్పగించడం, ఎవరు లేనివారిని వసతి గృహాల్లో చేర్పించడం చేస్తారు.
మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో ఇతర ప్రభుత్వ విభాగాలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆదివారం నాడు ప్రారంభం కానున్న ఈ కార్యక్రమానికి సంబంఽధించి ఆయా ప్రభుత్వ విభాగాల అధికారులతో మహిళా భ ద్రత విభాగం డీఐజీ సుమతి శుక్రవారం తన కార్యాలయం నుంచి వర్చువల్ సమీక్ష నిర్వహించారు. గత సంవత్సరం నిర్వహించిన ఆపరేషన్ స్మైల్-8 కార్యక్రమంలో 2,822 మంది చిన్నారుల్ని రక్షించారు. అందులో 2,463 మంది చిన్నారుల్ని తల్లిదండ్రులకు అప్పగించగా, 359 మందిని వసతి గృహాల్లో చేర్పించారు. ప్రతి సంవత్సరం జూలైలో ఇదే తరహాలో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. గత సంవత్సరం నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్-8లో 3,406 మంది చిన్నారుల్ని రక్షించారు. వారిలో 2,824 మందిని తల్లిదండ్రుల చెంతకు చేర్చగా, 582 మందిని వసతి గృహాల్లో చేర్పించినట్లు తెలంగాణ రాష్ట్ర పోలీసులు వెల్లడించారు.