పెళ్లి పేరుతో రూ.10లక్షలకు టోకరా.. నైజీరియన్‌ అరెస్ట్‌

ABN , First Publish Date - 2022-05-18T16:31:59+05:30 IST

మ్యాట్రిమోని సైట్లో యువతిని పరిచయం చేసుకొని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ. లక్షల్లో దోచుకున్న నైజీరియన్‌ సైబర్‌ నేరగాడిని రాచకొండ పోలీసులు

పెళ్లి పేరుతో రూ.10లక్షలకు టోకరా.. నైజీరియన్‌ అరెస్ట్‌

హైదరాబాద్‌ సిటీ: మ్యాట్రిమోని సైట్లో యువతిని పరిచయం చేసుకొని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ. లక్షల్లో దోచుకున్న నైజీరియన్‌ సైబర్‌ నేరగాడిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. నగరానికిచెందిన యువతి మ్యాట్రిమోని సైట్లో వివరాలు అప్‌లోడ్‌ చేసింది. ఆమె ప్రొఫైల్‌ను చూసిన అమరా ఫన్నీ సంప్రదించాడు. తాను ఎన్‌ఆర్‌ఐనని, అమెరికాలో ఉంటున్నానని నమ్మించాడు. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని ఆమెతో స్నేహం చేశాడు. కొద్దిరోజుల తర్వాత ఢిల్లీ విమానాశ్రయం కస్టమ్స్‌ అధికారులమంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఆమెకు ఫోన్‌ చేశారు.


అమెరికా నుంచి అమరా ఫన్నీ రూ. కోట్ల విలువైన కరెన్సీ, బంగారం తెచ్చాడని, యాంటీ టెర్రరిజం క్లియరెన్స్‌, డ్రగ్‌ క్లియరెన్స్‌, ఇంటర్నేషనల్‌ వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్ల కోసం కొంత నగదు చెల్లించాలని చెప్పారు. సదరు యువతి వారు చెప్పిన విధంగా రూ. 10 లక్షల నగదు పంపింది. ఎంతకూ క్లియరెన్స్‌ కాకపోవడం, ఇంకా డబ్బులు కావాలని అడుగుతుండటంతో అనుమానం వచ్చిన ఆ యువతి రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడ్ని గుర్తించారు. నైజీరియాకు చెందిన ముఠా ఢిల్లీలో ఉంటూ మోసానికి పాల్పడినట్లు గుర్తించారు. అమరా ఫన్నీని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated Date - 2022-05-18T16:31:59+05:30 IST