యువకుడి దారుణహత్య
ABN , First Publish Date - 2022-06-07T15:37:28+05:30 IST
పాత కక్షల నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి ఓ వ్యక్తిని కత్తులతో పొడిచి హత్య చేశారు. బహదూర్పురా ఇన్స్పెక్టర్ డి.దుర్గాప్రసాద్ తెలిపిన వివరాల
హైదరాబాద్/మదీన: పాత కక్షల నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి ఓ వ్యక్తిని కత్తులతో పొడిచి హత్య చేశారు. బహదూర్పురా ఇన్స్పెక్టర్ డి.దుర్గాప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. కిషన్బాగ్ అసద్ బాబానగర్కు చెందిన మహ్మద్ నవాజ్ కుమారుడు మహ్మద్ అర్షద్(32) ఆటోడ్రైవర్. అతడికి అదే ప్రాంతానికి చెందిన మహ్మద్ వాహిద్, మరి కొంతమంది స్నేహితులున్నారు. అందరూ ఆటోడ్రైవర్లే. అర్షద్, వాహిద్ల మధ్య రెండు రోజుల క్రితం గొడవ జరిగింది. అనంతరం వాహిద్, అతడి స్నేహితులను అర్షద్ కొట్టాడు. దీంతో అర్షద్పై పగ తీర్చుకోవాలని స్నేహితులతో కలిసి వాహిద్ పథకం పన్నాడు. దీనిలో భాగంగా మాట్లాడుకుందాం రా అని కిషన్బాగ్లోని డిస్నీలాండ్ హోటల్ వద్దకు ఆదివారం పిలిపించారు. అక్కడికి వచ్చిన అర్షద్తో వాదనకు దిగారు. అనంతరం అర్షద్పై కత్తితో దాడి చేశారు. ఒకరు బీరు సీసాతో తలపై కొట్టాడు. తీవ్ర గాయాలపాలైన అర్షద్ను స్థానికులు ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. బహదూర్పురా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు.