మోదీ అంటే కేసీఆర్‌కు భయం

ABN , First Publish Date - 2022-11-12T03:49:10+05:30 IST

ప్రధాని మోదీ అంటే కేసీఆర్‌కు భయం పట్టుకున్నట్టు ఉందని, ఆయనకు ఎదురుపడే ధైర్యం చేయలేక పిల్లిలా దాక్కుంటున్నారని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు ఎద్దేవా చేశారు.

మోదీ అంటే కేసీఆర్‌కు భయం

ఎదురుపడే ధైర్యం లేక పిల్లిలా దాక్కున్నారు: షర్మిల

గోదావరిఖని/కమాన్‌పూర్‌, నవంబరు 11: ప్రధాని మోదీ అంటే కేసీఆర్‌కు భయం పట్టుకున్నట్టు ఉందని, ఆయనకు ఎదురుపడే ధైర్యం చేయలేక పిల్లిలా దాక్కుంటున్నారని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు ఎద్దేవా చేశారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌ మం డలం పెంచికలపేట్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె పాల్గొన్నారు. గతంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ దోస్తీ కట్టాయని, ఇప్పుడు ఏమైందో ఏమో గానీ శత్రువుల్లా వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు. కేసీఆర్‌కు దమ్ముంటే విభజన హామీలపై ప్రధానిని నిలదీయాలని, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ప్రశ్నించాలని డిమాండ్‌ చేశారు.

వైఎస్సార్‌ పాలనలో రైతులకు రుణమాఫీ చేయడంతోపాటు ఉచిత విద్యుత్తును అందించారని గుర్తు చేశారు. రైతులు పంట నష్టపోతే పరిహారం అందించడంతోపాటు విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లపై సబ్సిడీపై అందించారని, ఇప్పుడు కేసీఆర్‌ పాలనలో ఇవేమైనా ఉన్నాయా? అని ప్రశ్నించారు. సబ్సిడీలన్నీ ఎత్తి వేసి రైతుబంధు పేరిట రూ.5వేలు ఇచ్చినంత మాత్రాన రైతులు లక్షాధికారులు అవుతారా? అని నిలదీశారు. మాట నిలబెట్టుకోని సీఎంను గద్దె దించాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్‌ బిడ్డగా ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజల పక్షాన నిలుస్తానని, వచ్చే ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించాలని కోరారు.

Updated Date - 2022-11-12T03:49:12+05:30 IST