Hyderabad: ఆత్మహత్య కేసులో ఏడుగురికి రిమాండ్
ABN , First Publish Date - 2022-02-16T17:36:35+05:30 IST
సింగరేణి కాలనీ స్థల వివాదంలో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న కేసులో సైదాబాద్ పోలీసులు మంగళవారం ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
హైదరాబాద్/సైదాబాద్: సింగరేణి కాలనీ స్థల వివాదంలో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న కేసులో సైదాబాద్ పోలీసులు మంగళవారం ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. సింగరేణి కాలనీ ప్రధాన రహదారి పక్కన 262 గజాల వివాదాస్పద స్థలం ఉంది. అందులో హరి అనిల్కుమార్ ఇల్లు నిర్మించుకుని సర్వీసింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. కొందరు స్థానికులు అతడి ఇల్లు, సర్వీసింగ్ సెంటర్పై దాడి చేశారు. మనస్తాపానికి గురైన హరి అనిల్కుమార్ గత శనివారం రాత్రి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని రోడ్డుపైకి వచ్చి పోలీసుల ముందు కుప్పకూలిపోయాడు. పోలీసులు అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు. బాధితుల ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. సింగిరేణి కాలనీ గుడిసెలకు చెందిన రమాదేవి, కరణ్, పరుగు మహి, మణి, మహి, రాకేష్, కూరగాయల రవి, కళ్యాణ్లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
‘మృతికి కారణమైన దంపతులపై చర్యలు తీసుకోవాలి’
నా భర్త ఆత్మహ్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు వేడుకొంది. మంగళవారం సింగరేణి కాలనీలో బాధితురాలు సోనీ మహిళా సంఘాలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. సోనీ మాట్లాడుతూ మేస్త్రీగా పనిచేసే తన భర్త హరీ్షను స్థానింగా నివసించే దంపతులు నమ్మించి మోసం చేయడమే కాకుండా కొట్టి ఆవమానించారన్నారు. మనస్థాపానికి గురైన అతను డిసెంబర్ 14న అత్మహత్యకు పాల్పడ్డాడని, సూసైడ్ నోటులో అత్మహత్యకు కారకులైన దంపతుల పేర్లను రాసినట్టు ఆమె తెలిపింది. అయినా సైదాబాద్ పోలీసులు వారిపై కేసు నమోదు చేయలేదని, ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయింది. న్యాయం చేయకపోతే సైదాబాద్ పీఎస్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తానని హెచ్చరించింది.