అక్రమ అరెస్ట్లు దుర్మార్గం: మల్లు రవి
ABN , First Publish Date - 2022-02-16T16:50:40+05:30 IST
రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతల అరెస్ట్లపై ఆ పార్టీ నేత మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ అరెస్ట్లు దుర్మార్గమన్నారు.
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతల అరెస్ట్లపై ఆ పార్టీ నేత మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ అరెస్ట్లు దుర్మార్గమన్నారు. నిరసన వ్యక్తం చేస్తామంటే కాంగ్రెస్ నాయకులను అరెస్ట్లు చేస్తారా అని మండిపడ్డారు. కేసీఆర్ బీజేపీ కోవర్ట్ అని.. బీజేపీకి లాభం చేసేందుకే మూడో ఫ్రంట్ ముచ్చట్లు అని విమర్శించారు. బీజేపీ వ్యతిరేక ఓటు కాంగ్రెస్కు రాకుండా అడ్డుకొని బీజేపీకి లాభం చేసేలా కేసీఆర్ వ్యూహం పనుతున్నారని ఆరోపించారు. వారణాసిలో మీటింగ్కు వెళ్తాన్నన్న కేసీఆర్ను కూడా ఇలాగే అరెస్ట్లు చెస్తే ఏమి చేస్తారని ఆయన ప్రశ్నించారు. రాహుల్ గాంధీపైన అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలపై మాట్లాడిన కేసీఆర్ తాము ఫిర్యాదు చేస్తే ఎందుకు పోలీసులు కేసు నమోదు చేయడం లేదని నిలదీశారు. కేసులు నమోదు చేయడం లేదని కాంగ్రెస్ శ్రేణులు పోలీస్ కమిషనరేట్ల ముందు ధర్నా చేసి నిరసన వ్యక్తం చేస్తామంటే హౌస్ అరెస్ట్లు చేయడం ఏంటని మండిపడ్డారు. కాంగ్రెస్ను అడ్డుకునేందుకు కేసీఆర్ను మోదీ కోవర్ట్గా వాడుకుంటున్నారన్నారు. కేసీఆర్ మాటలు, చేష్టలు కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు నమ్మొద్దని మల్లు రవి అన్నారు.