దొంగల ముఠా అరెస్ట్‌

ABN , First Publish Date - 2022-06-07T16:01:52+05:30 IST

ఇళ్లల్లో చోరీలు, స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ముగ్గు రు సభ్యుల దొంగల ముఠాతో పాటు ఓనర్‌ ఇంటికే కన్నం వేసిన మరో కిరాణా షాపు యజమానిని రాచకొండ

దొంగల ముఠా అరెస్ట్‌

వేర్వేరు కేసుల్లో నలుగురు.. 

98 తులాల బంగారం స్వాధీనం

యజమాని ఇంటికే కన్నం వేసిన వ్యాపారి 


హైదరాబాద్‌ సిటీ: ఇళ్లల్లో చోరీలు, స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ముగ్గు రు సభ్యుల దొంగల ముఠాతో పాటు ఓనర్‌ ఇంటికే కన్నం వేసిన మరో కిరాణా షాపు యజమానిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. రెండు ముఠాల నుంచి రూ.96 లక్షలు విలువ చేసే 98 తులాల బంగారు ఆభరణాలు, రూ.3.09 లక్షల నగదు స్వాఽధీనం చేసుకున్నారు. రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ సోమవారం వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్‌ జిల్లా, నెల్లికుదురు మండలానికి చెందిన దాసరి మురళి (26), కూతటి పరమేశ్‌(28), తోట సారయ్య (38) ముఠాగా ఏర్పడ్డారు. ఏడాదిలో వివిధ జిల్లాల్లోని 12 పీఎ్‌సల పరిధుల్లో మొత్తం 13చోరీలకు పాల్పడ్డారు. ఆయా కేసుల్లో తప్పించుకు తిరుగుతున్న గ్యాంగ్‌ను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. వారి నుంచి మొత్తం రూ.26 లక్షలు విలువ చేసే 44.5 తులాల బంగారు ఆభరణాలు, 1.2 కేజీల వెండి, రూ.1.59 లక్షల నగదు, ఓ ద్విచక్ర వాహనం, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వివిధ పీఎ్‌సలతో పాటు భువనగిరి రూరల్‌ పీఎస్‌ పరిఽధిలో జరిగిన చోరీ నేపథ్యంలో రాచకొండ, భువనగిరి సీసీఎస్‌ పోలీసులు పలు సాంకేతిక ఆధారాలను సేకరించి నిందితులను అరెస్టు చేశారు. 


యజమాని ఇంటికే కన్నం

నాచారంలోని రాఘవేంద్ర కాలనీకి చెందిన గౌరిసెట్టి జ్యోత్స్న  కుటుంబం గత నెల 27న తిరుపతి దర్శనానికి వెళ్లింది. ఈ నెల ఒకటిన వారి ఇంటి గేట్లు తెరిచి ఉన్నాయని గ్రౌండ్‌ఫ్లోర్‌లో కిరాణా షాపు నిర్వహించే అరుణ్‌కమార్‌ ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చాడు. వెంటనే ఆమె తల్లిదండ్రులను అక్కడికి పంపించగా, చోరీ జరిగిన విషయాన్ని నిర్ధారించారు. ఈ నెల 3న తిరిగొచ్చిన ఆమె 41.8 తులాల బంగారు, 500 గ్రాముల వెండి ఆభరణాలు చోరీ అయ్యాయని గుర్తించి ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు అనుమానాస్పదంగా కనిపించిన అరుణ్‌కుమార్‌ను ప్రశ్నించారు. తానే చోరీకి పాల్పడినట్లు అంగీకరించాడు. యజమాని లేని సమయంలో పట్టపగలే వారి ఇంట్లోకి ప్రవేశించి చోరీకి పాల్పడ్డాడు. అరుణ్‌కుమార్‌ షాపులో దాచి పెట్టిన రూ.30.5 లక్షలు విలువ చేసే 53.9 తులాల బంగారు ఆభరణాలను, 1.5 లక్షల నగదును నాచారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 


పాత నేరస్థులే..

22 ఏళ్ల ప్రాయంలోనే చోరీలకు అలవాటు పడ్డ దాసరి మురళి పలుమార్లు అరెస్టు అయి జైలుకెళ్లాడు. రెండు సార్లు రాచకొండలో అరెస్టు కాగా, అతనిపై మహబూబాబాద్‌ జిల్లాలో పీడీయాక్ట్‌ కూడా నమోదైంది. మహబూబ్‌నగర్‌ జిల్లా, మిడ్జిల్‌లో సంచలనం సృష్టించిన ఓ చోరీ ఘటనలో 84 తులాల బంగారు ఆభరణాలను తస్కరించిన కేసులో కూడా అరెస్టు అయ్యాడు. దీంతో అతడిపై రెండో సారి కూడా పీడీయాక్ట్‌ నమోదైంది. గతేడాది ఆగస్టులో జైలు నుంచి విడుదలై పాత స్నేహితులతో కలిసి మళ్లీ చోరీల బాట పట్టాడు. ఇప్పటి వరకు 37 కేసుల్లో నిందితుడిగా ఉన్నా డు. 12 నాన్‌ బెయిలబుల్‌ వారంట్లు అతడిపై పెండింగ్‌లో ఉన్నాయి. కూతటి పరమేశ్‌ 19 ఏళ్ల లోనే తొలి చోరీ చేసి నేరాల బాట పట్టాడు. చెడు అలవాట్లకు బానిసగా మారి డబ్బు కోసం చోరీల వైపు మళ్లాడు. ఇప్పటి వరకు అతడిపై నాలుగు కేసులు, రెండు నాన్‌బెయిలబుల్‌ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. తోట సారయ్య గతంలో ఓ చోరీ కేసులో పాల్గొన్నట్లు పోలీసు విచారణలో అంగీకరించాడు.

Updated Date - 2022-06-07T16:01:52+05:30 IST