పోలీసు వారి పాట..!
ABN , First Publish Date - 2022-02-23T16:09:16+05:30 IST
ఇవన్నీ పలు కేసుల్లో పోలీసులు సీజ్ చేసిన వాహనాలు. నిబంధనలను అనుసరించి తిరిగి తీసుకోవాలని వివిధ మాధ్యమాల ద్వారా
హైదరాబాద్ సిటీ: ఇవన్నీ పలు కేసుల్లో పోలీసులు సీజ్ చేసిన వాహనాలు. నిబంధనలను అనుసరించి తిరిగి తీసుకోవాలని వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం కల్పించినా యజమానులు ముందుకు రాలేదు. గోషామహల్ స్టేడియంలో పేరుకుపోయిన 600 వాహనాలకు హైదరాబాద్ సిటీ పోలీసులు మంగళవారం వేలం నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రాల నుంచి మొత్తం 550 మంది బిడ్డర్లు వేలంలో పాల్గొన్నారు. వాటిలో స్ర్కాప్నకు మాత్రమే పనిచేసే 567 వాహనాల (544 ద్విచక్ర, 21 త్రిచక్ర, 2 కార్లు) ద్వారా రూ. 44.28 లక్షలు సమకూరాయి. వినియోగించేందుకు అనుకూలంగా ఉన్న 33 వాహనాల (32 ద్విచక్ర, ఓ కారు) ద్వారా రూ. 7.46లక్షలు వచ్చాయి. వేలం ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం రూ. 51.74 లక్షలను ఖజానాలో జమ చేయనున్నట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. నిష్పక్షపాతంగా వేలం జరిగేలా సీపీ పర్యవేక్షించారు. అక్రమంగా మాదకద్రవ్యాల రవాణా, వినియోగంపై అప్రమత్తంగా ఉండాలని వ్యాపారులకు ఈ సందర్భంగా సీపీ సూచించారు.