Hyderabadలో ఉగ్రకుట్ర భగ్నం కేసు.. జాహెద్ రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు

ABN , First Publish Date - 2022-10-04T22:29:10+05:30 IST

ఉగ్రకుట్ర భగ్నం కేసుకు సంబంధించి జాహెద్ రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.

Hyderabadలో ఉగ్రకుట్ర భగ్నం కేసు.. జాహెద్ రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు

హైదరాబాద్‌ (Hyderabad): నగరంలో ఉగ్రకుట్ర భగ్నం కేసుకు సంబంధించి జాహెద్ రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. పేలుడు పదార్థాలు పాకిస్తాన్‌ నుంచి ఫరాతుల్లా గౌరీ పంపినట్లు పోలీసులు గుర్తించారు. మహారాష్ట్రలోని మనోహరాబాద్‌కు వచ్చిన పేలుడు పదార్థాలు.. గత నెల 28న జాహెద్‌కు చేరాయి. బైక్‌పై వెళ్లిన జాహెద్ 4 గ్రనేడ్లను తీసుకొచ్చాడు. ఒక గ్రనేడ్ ఉంచుకొని మూడింటిని షమీ, మజాలకు అందజేశాడు. షమీ సెల్‌ఫోన్‌తో ఫరాతుల్లా గౌరీతో జాహెద్ చాట్ చేశాడు. 12 ఏళ్లు జైల్లో ఉండి తిరిగొచ్చి ఉగ్ర కార్యకలాపాలకు ప్లాన్ చేశాడు.


పాకిస్తాన్‌లో ఉన్న హ్యాండ్లర్ల ద్వారా ఉగ్ర కార్యకలాపాలకు ఫరాతుల్లా గౌరీ ప్రణాళిక చేశాడు. రూ. 30 లక్షలకుపైగా హవాలా ద్వారా నిందితులకు నగదు అందింది. యువకులకు డబ్బులిచ్చి ఉగ్రవాదం వైపు మళ్లింపునకు ప్లాన్‌ చేశాడు. హైదరాబాద్‌లో జరిగే సామూహిక ఉత్సవాల్లో దాడులకు ప్లాన్ రచించాడు. మజా, షమీ, జాహెద్‌లతో కలిసి ఒకేసారి దాడులకు కుట్ర పన్నారు. హైదరాబాద్‌లో మత కల్లోలాలు సృష్టించి భయోత్పాతానికి ప్లాన్ చేశారు. సామూహిక దాడులతో ప్రజల్లో అనిశ్చితి నెలకొల్పి.. అంతర్గత భద్రతకు ముప్పువాటిళ్లే విధంగా దాడులకు స్కెచ్ వేశారు. భారీగా ప్రాణ నష్టం చేయాలని నిందితులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ కుట్రను సీసీఎస్ పోలీసులు భగ్నం చేశారు.

Updated Date - 2022-10-04T22:29:10+05:30 IST