భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-03-16T16:58:55+05:30 IST
భార్య కాపురానికి రావడం లేదని మనోవేదనకు గురైన భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన గాంధీనగర్ పోలీసు
హైదరాబాద్/కవాడిగూడ: భార్య కాపురానికి రావడం లేదని మనోవేదనకు గురైన భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన గాంధీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని దోమలగూడ బీమా మైదాన్ వాంబే కాలనీలో సోమవారం అర్ధరాత్రి జరిగింది. సీఐ మోహన్రావు తెలిపిన వివరాల ప్రకారం.. దోమలగూడ బీమా మైదాన్ వాంబే కాలనీలో నివాసం ఉండే సాయికుమార్(28) వెల్డింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లికి ముందు నుంచే సాయికుమార్ మద్యం తాగేవాడు. పెళ్లైయిన తర్వాత కూడా మద్యం తాగడం మానకపోవడంతో భార్య అతన్ని వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి సాయికుమార్ మద్యానికి మరింతగా బానిసయ్యాడు.
సాయికుమార్ తల్లి సోమవారం రాత్రి జగద్గిరిగుట్టలోని బంధువుల ఇంటికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సాయికుమార్ చీరతో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వారి ఇంటికి ఎదురుగా సాయికుమార్ చెల్లి, బావ నివాసం ఉంటున్నారు. ఇంటి తలుపు చాలా సేపు మూసి ఉండడంతో అనుమానం వచ్చిన వారు వెంటనే గాంధీనగర్ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ నాగార్జునరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని సాయికుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.