పోలీసు ఎంపికల్లో మాకు న్యాయం చెయ్యండి
ABN , First Publish Date - 2022-12-10T03:20:28+05:30 IST
పోలీసు ఎంపిక పరీక్షల్లో భాగమైన దేహదారుఢ్య పరీక్షలను తమకు ప్రత్యేకంగా నిర్వహించాలని ట్రాన్స్జెండర్లు డిమాండ్ చేస్తున్నారు.
హనుమకొండ కేయూ మైదానం వద్ద ట్రాన్స్జెండర్ల నిరసన
దేహదారుఢ్య పరీక్షలు ప్రత్యేకంగా నిర్వహించాలని డిమాండ్
హనుమకొండ క్రైం, డిసెంబరు 9 : పోలీసు ఎంపిక పరీక్షల్లో భాగమైన దేహదారుఢ్య పరీక్షలను తమకు ప్రత్యేకంగా నిర్వహించాలని ట్రాన్స్జెండర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు హనుమకొండ, కేయూ మైదానం వద్ద పలువురు ట్రాన్స్జెండర్లు శుక్రవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ట్రాన్స్జెండర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు లైలా మాట్లాడుతూ.. కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల దరఖాస్తులో పురుషులు/స్త్రీలు అని మాత్రమే ఉందని ‘ఇతరులు’ అని లేదన్నారు. పదో తరగతి సర్టిఫికెట్ ప్రకారం కొందరు ట్రాన్స్జెండర్లు పురుషులుగా దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఫిజికల్ టెస్టులకు వారిని పురుషులుగానే పరిగణిస్తున్నారని వాపోయారు. ట్రాన్స్జెండర్ అభ్యర్థులు పురుషులతో సమానంగా పరుగెత్తలేరని, మహిళలతో కలిసి ఎంపికల్లో పాల్గొనలేరని వివరించారు. రిక్రూట్మెంట్ బోర్డు స్పందించి ప్రత్యేకంగా దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు మినహాయింపులు ఇవ్వాలని కోరారు. కాగా, ఈ సమస్య తమ పరిధిలోనిది కాదని, విధాన నిర్ణయమని వరంగల్ సీపీ స్పష్టం చేశారు. పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు, డీజీకి సమాచారం అందించామని చెప్పారు. శుక్రవారం దేహదారుఢ్య పరీక్షల్లో పురుషులతో కలిసి పరుగెత్తిన ఓ ట్రాన్స్జెండర్ అర్హత సాధించలేకపోయారని వివరించారు.