ప్రశాంతంగా నీట్
ABN , First Publish Date - 2022-07-18T05:46:54+05:30 IST
డీఏవీ పాఠశాల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన నీట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.
కట్టుదిట్టమైన భద్రత
15 నిమిషాలు ఆలస్యమైనందుకు విద్యార్థినికి అనుమతి నిరాకరణ
కూకట్పల్లి, జూలై 17 (ఆంధ్రజ్యోతి): డీఏవీ పాఠశాల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన నీట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 715మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. మధ్యాహ్నం 12గంటల నుంచే పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తరలివచ్చారు. మధ్యాహ్నం 2గంటలకు పరీక్ష ప్రారంభమైంది. ఈ సందర్భంగా విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీచేసి పరీక్ష హాల్లోకి పంపారు. శంకర్పల్లి నుంచి పరీక్షా కేంద్రానికి 15నిమిషాలు ఆలస్యంగా వచ్చిన భవ్య అనే విద్యార్థినిను పరీక్షా కేంద్రంలోకి అధికారులు అనుమతించలేదు. దీంతో ఆమె నిరుత్సాహంతో వెనుదిరిగింది. కొందరు విద్యార్థులు ఆఖరి నిమిషంలో హడావిడిగా పరీక్షా కేంద్రానికి వచ్చి పరుగెత్తుకొంటూ లోపలికి వెళ్లారు.
భెల్కాలనీ (ఆంధ్రజ్యోతి): బీహెచ్ఈఎల్ టౌన్షిప్ లో గల భారతీయ విద్యా భవన్స్ పాఠశాలలో ఆదివారం ఉదయం నీట్ పరీక్ష కట్టుదిట్టమైన భద్రత నడుమ జరిగింది. తెలుగు రాష్ర్టాలు, వివిధ జిల్లాల నుంచి పరీక్ష రాసేందుకు విద్యార్ధులు పెద్దఎత్తున తరలివచ్చారు. దీం తో పరీక్ష నిర్వాహకులు, పాఠశాల యాజమాన్యం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. భవన్స్ పాఠశాల ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి పర్యవేక్షణలో బీహెచ్ఈఎల్ సెం టర్లో మొత్తం 864మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు ఏర్పా ట్లు చేశారు. 815మంది విద్యార్ధులు పరీక్షకు హాజరు కాగా 49మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. నీట్ నిర్వాహకులు కచ్చితమైన నిబంధనలు ప్రకటించడంతో వివిధ జిల్లాల నుంచి పరీక్ష రాసేందుకు ఉదయం 10.30గంటలకే అభ్యర్థులు చేరుకున్నారు. వీరిని తనిఖీచేసి మధ్యాహ్నం 1.30వరకు కేంద్రంలోకి అనుమతించారు. పరీక్షను సమయానికి ప్రారంభించిన నిర్వాహకులు సాయంత్రం 5:20కి ముగించారు. మధ్యాహ్నం వరకు వాతావరణం ఎండగా ఉన్నా సాయంత్రం 4గంటల నుంచి వర్షం పడడంతో తల్లిదండ్రులు ఇబ్బందులు పడ్డారు.