అక్రమార్కులపైనే ఈడీ దాడులు
ABN , First Publish Date - 2022-11-24T04:11:56+05:30 IST
రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలందరిపై ఐటీ, ఈడీ దాడులు జరగడం లేదని, ఎవరైతే అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించారో వారి మీదే జరుగుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు అన్నారు. గ్రానైట్ వ్యాపారం, మెడికల్ కాలేజీలు, ఫార్మా బిజినెస్ ఉన్నవారి ఇండ్లలోనే సోదాలు నిర్వహిస్తున్నారని చెప్పారు.
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు
హైదరాబాదు, నవంబర్ 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలందరిపై ఐటీ, ఈడీ దాడులు జరగడం లేదని, ఎవరైతే అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించారో వారి మీదే జరుగుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు అన్నారు. గ్రానైట్ వ్యాపారం, మెడికల్ కాలేజీలు, ఫార్మా బిజినెస్ ఉన్నవారి ఇండ్లలోనే సోదాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. పద్మాదేవేందర్ రెడ్డి, రసమయి, క్రాంతిలపై దాడులు జరగడం లేదని పేర్కొన్నారు. బుధవారం రఘునందన్రావు మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేలకు కేటాయించే నియోజకవర్గ అభివృద్ధి నిధులను కూడా తన ద్వారా ఖర్చుపెట్టనివ్వడం లేదని ఆరోపించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేను కాదన్న కారణంతోనే ఇలా వివక్ష చూపిస్తున్నారని పేర్కొన్నారు. ఆంధ్రా నాయకుల పాలనలో కూడా ఎమ్మెల్యేల పట్ల ఇంత వివక్ష చూడలేదని వాపోయారు. కాగా ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావు మృతికి సీఎం కేసీఆర్దే బాధ్యత అని రఘునందన్ అన్నారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వకపోవడం వల్లనే ఈ దారుణం జరిగిందన్నారు.