రైతు కుటుంబాలకు పరిహారం చెల్లింపులో ఆలస్యం
ABN , First Publish Date - 2022-11-30T04:08:18+05:30 IST
పంటనష్టం వల్ల ఆత్మహత్య చేసుకున్న రైతులకు ఇస్తామన్న రూ.6 లక్షల పరిహారం చెల్లింపుల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకోవడంపై వివరణ ఇవ్వాలని హైకోర్టు మంగళవారం ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.
వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు
హైదరాబాద్, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): పంటనష్టం వల్ల ఆత్మహత్య చేసుకున్న రైతులకు ఇస్తామన్న రూ.6 లక్షల పరిహారం చెల్లింపుల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకోవడంపై వివరణ ఇవ్వాలని హైకోర్టు మంగళవారం ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. 2014 జూన్ 2 నుంచి పంటనష్టం కారణంగా ఆత్మహత్య చేసుకున్న రైతులకు రూ.6 లక్షలు పరిహారంగా చెల్లించాలని నిర్ణయిస్తూ ప్రభుత్వం జీవో నెంబర్లు 173, 194 జారీచేసింది. పలు జిల్లాల్లో దాదాపు 100 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటూ స్థానిక పోలీసులు జిల్లా కలెక్టర్లకు నివేదికలు సమర్పించారు. స్పష్టమైన నివేదికలు ఉన్నా పరిహారం ఇవ్వడం లేదని పేర్కొంటూ బి. కొండల్ రెడ్డి అనే సామాజిక కార్యకర్త హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ సీవీ భాస్కర్రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వసుధా నాగరాజ్ వాదనలు వినిపించారు. తదుపరి విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేసింది.