Bihar Tour: రేపు బీహార్ పర్యటనకు సీఎం కేసీఆర్..

ABN , First Publish Date - 2022-08-30T17:31:57+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) బుధవారం బీహార్ పర్యటనకు వెళ్లనున్నారు.

Bihar Tour: రేపు బీహార్ పర్యటనకు సీఎం కేసీఆర్..

హైదరాబాద్ (Hyderabad): ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) బుధవారం బీహార్ పర్యటనకు వెళ్లనున్నారు. ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్‌ (CM Nitish Kumar)తో జాతీయ రాజకీయాలపై చర్చలు జరపనున్నారు. హైదరాబాద్‌ నుంచి పాట్నాకు ప్రత్యేక విమానంలో బయలుదేరుతారు. ముందుగా నితీష్‌తో కలిసి గతంలో ప్రకటించిన మేరకు గల్వాన్‌ (Galvan) లోయలో అమరులైన ఐదుగురు భారత సైనికుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందజేయనున్నారు. అలాగే ఇటీవల సికింద్రాబాద్ టింబర్ డిపోలో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 12 మంది బీహార్ కార్మికుల కుటుంబాలకు కూడా రూ. 5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నారు.


ఈ సందర్బంగా ఇద్దరు నేతల (కేసీఆర్, నితీష్) మధ్య జాతీయ రాజకీయాలపై చర్చ జరుగనుంది. జాతీయ రాజకీయాల్లో బీజేపీయేతర పార్టీల మధ్య ఐక్యత, సమన్వయం విషయంలో ఎలా ముందుకెళ్లాలన్నదానిపై చర్చించనున్నారు. వాస్తవానికి గల్వాన్‌ లోయలో ఘర్షణలో అమరులైన సైనికుల కుటుంబాలకు పరిహారం అందిస్తామని సీఎం కేసీఆర్ గతంలోనే ప్రకటించారు. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో బీజేపీకి వ్యతిరేకంగా వెళుతున్నందున కలిసొచ్చే పార్టీలతో పనిచేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.

Updated Date - 2022-08-30T17:31:57+05:30 IST