Charminar వద్ద తవ్వకాల్లో బయటపడ్డ మెట్లు

ABN , First Publish Date - 2022-02-16T17:27:22+05:30 IST

చార్మినార్‌ వద్ద పురావస్తు శాఖ అధికారులు జరిపిన తవ్వకాల్లో మెట్లు కనిపించడం చర్చనీయాంశం అవుతోంది.

Charminar వద్ద తవ్వకాల్లో బయటపడ్డ మెట్లు

ఎవరనుమతించారని మజ్లిస్‌ మండిపాటు

హైదరాబాద్‌ సిటీ/చార్మినార్‌: చార్మినార్‌ వద్ద పురావస్తు శాఖ అధికారులు జరిపిన తవ్వకాల్లో మెట్లు కనిపించడం చర్చనీయాంశం అవుతోంది. చార్మినార్‌ వద్ద మంగళవారం లాడ్‌ బజార్‌ నుంచి భాగ్యలక్మి టెంపుల్‌ వరకు ఉన్న మినార్‌ల మధ్య భాగంలో పురావస్తు శాఖ తవ్వకాలు జరిపింది. జనరేటర్‌ ఏర్పాటు, ఎర్త్‌ను అరికట్టడం కోసం జరిపిన తవ్వకాలలో మెట్లు బయటకు కనిపించాయి. ఆ వెంటనే పురావస్తుశాఖ అధికారులు తవ్వకాలను నిలిపివేశారు. కొద్దిసేపటికే ఆ తాలూకు ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. సమాచారం అందుకున్న మజ్లిస్‌ నేతలు అక్కడికి చేరుకుని పురావస్తుశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చారిత్రక కట్టడమైన చార్మినార్‌ వద్ద తవ్వకాలకు ఎవరి నుంచి అనుమతులు తీసుకున్నారని ప్రశ్నించారు.


విషయం తెలిసిన పురావస్తు శాఖ ఉన్నతాధికారులు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుని వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. తవ్వకాల్లో బయటపడ్డ అండర్‌ గ్రౌండ్‌ మెట్లు, గుంతలను, రాళ్లను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం తవ్వకాలు జరిగిన ప్రాంతంలో మట్టి పోసి తాత్కాలికంగా మూసి వేశారు. కాగా చార్మినార్‌ వద్ద తవ్వకాల్లో కనిపించిన మెట్లు అండర్‌ గ్రౌండ్‌ దారికి సంబంధించిన మెట్లు కావని అఽధికారులు స్పష్టం చేశారు. కొన్నేళ్ల క్రితం అక్కడ చేపట్టిన ఓ నిర్మాణానికి సంబంధించిన రాళ్లేనని చెప్పారు. 

Updated Date - 2022-02-16T17:27:22+05:30 IST