పోలీసులపై దురుసు ప్రవర్తన.. ఇద్దరికి జైలు
ABN , First Publish Date - 2022-02-23T15:49:18+05:30 IST
పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన ఇద్దరు యువకులను బోయినపల్లి పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం న్యూ బోయినపల్లి
హైదరాబాద్/బోయినపల్లి: పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన ఇద్దరు యువకులను బోయినపల్లి పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం న్యూ బోయినపల్లి సంజీవయ్యనగర్కు చెందిన సాయి, ధృవ మద్యం మత్తులో సోమవారం తెల్లవారుజాము 4.50 సమయంలో కంసరిబజార్లో ఉండే రవి ఇంట్లోకి చొరబడ్డారు. అతడ్ని చితకబాది, రవి తల్లి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. సమాచారం అందుకున్న బోయినపల్లి పోలీసులు గస్తీలో ఉన్న కానిస్టేబుళ్లు శ్రీకాంత్, పవన్లను రవి ఇంటికి పంపారు. వారు రవిని వెంటబెట్టుకుని నిందితుల వద్దకు వెళ్లారు. అక్కడ మరోసారి రవిపై వారు దాడికి యత్నించారు. అడ్డుకునేందుకు యత్నించిన కానిస్టేబుల్ శ్రీకాంత్పై చేయి చేసుకున్నారు. శ్రీకాంత్ సమాచారంతో మరో ఇద్దరు కానిస్టేబుళ్లు ధీరజ్, మురళి అక్కడకు చేరుకున్నారు. నిందితులు మురళి పట్ల కూడా దురుసుగా ప్రవర్తించారు. శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను మంగళవారం అరెస్ట్ చేశారు.