Vijayashanti: ఏం కేసీఆర్... ఉద్యోగులతో ఇంకెన్ని రోజులు ఈ ఆటలు?

ABN , First Publish Date - 2022-09-27T16:36:22+05:30 IST

తెలంగాణ ఉద్యోగులకు కేసీఆర్ సర్కార్ పండగపూట కూడా పైసలిచ్చేలా లేదని బీజేపీ నేత విజయశాంతి అన్నారు.

Vijayashanti: ఏం కేసీఆర్... ఉద్యోగులతో ఇంకెన్ని రోజులు ఈ ఆటలు?

హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగులకు కేసీఆర్ సర్కార్ (KCR Government) పండగపూట కూడా పైసలిచ్చేలా లేదని బీజేపీ నేత విజయశాంతి (Vijayashanti) అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే అంశంపై సోషల్ మీడియా వేదికగా విజయశాంతి (BJP ) స్పందించారు. అక్టోబర్ 3న బతుకమ్మ, 5న దసరా పండుగలున్నాయని... కానీ రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు జీతాల టెన్షన్ పట్టుకుందని అన్నారు. సరైన సమయానికి వేతనాలు వస్తాయా? లేవా? అనే ఆందోళనలో ఉద్యోగులున్నారని తెలిపారు. ఈ విషయంపైనే ఆర్థికశాఖ మల్లగుల్లాలు పడుతోందన్నారు. గతేడాది కూడా పండుగ తర్వాతే జీతం జమ అయ్యిందని గుర్తుచేశారు. ప్రతి నెలా జీతాలు ఆలస్యమవుతూనే ఉన్నాయని బీజేపీ నేత అన్నారు.


అక్టోబర్ మొదటివారంలోనే బతుకమ్మ, దసరా పండుగలు ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో టెన్షన్ మొదలైందన్నారు. ప్రతి నెలా ప్రభుత్వం ఆలస్యంగా వేతనాలు జమ చేస్తుండటంతో.. అక్టోబర్‌లోనూ అలాగే లేట్ అయితే... పండుగలకు పైసలెట్ల? అనే ఆందోళన మొదలైందని తెలిపారు. కనీసం వచ్చే నెలలో అయినా ఒకటో తేదీకి జీతాలొస్తే పండుగ షాపింగ్ చేయొచ్చనే ఆలోచనలో ఉన్నారని.... కానీ వేతనాలను ప్రభుత్వం ముందుగానే జమ చేస్తుందా? లేదా ఎప్పటిలాగే ఆలస్యంగా అందిస్తుందా? అనేది సస్పెన్స్‌గా మారిందన్నారు. ‘‘ఏం కేసీఆర్... ఉద్యోగులతో ఇంకెన్ని రోజులు ఈ ఆటలు? త్వరలో సర్కారీ ఉద్యోగులే... కేసీఆర్ సర్కార్‌ను పడగొట్టడం ఖాయం’’ అంటూ విజయశాంతి వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2022-09-27T16:36:22+05:30 IST