వచ్చే నెలలో అందుబాటులోకి బహదూర్పురా వంతెన
ABN , First Publish Date - 2022-02-19T14:09:22+05:30 IST
వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం(ఎస్ఆర్డీపీ)లో మరో వంతెన అందుబాటులోకి రానుంది.
- నెలాఖరుకు ఎల్బీనగర్ అండర్పాస్
హైదరాబాద్ సిటీ : వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం(ఎస్ఆర్డీపీ)లో మరో వంతెన అందుబాటులోకి రానుంది. రూ.69 కోట్లతో చేపట్టిన బహదురా వంతెనను వచ్చే నెలలో ప్రారంభించనున్నట్టు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో జీహెచ్ఎంసీ పేర్కొంది. ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే శంషాబాద్ వైపు నుంచి ఆరాంఘర్, ఎల్బీనగర్, యాదాద్రి, ఇతర ప్రాంతాలకు సిగ్నల్ చిక్కులు లేని ప్రయాణానికి వీలవుతుంది. ఈ మార్గంలోని ఓవైసీ ఆస్పత్రి వద్ద రెండు నెలల క్రితం అబ్దుల్ కలాం వంతెనను మంత్రి కె. తారక రామారావు ప్రారంభించారు. రూ.8 వేల కోట్లతో ఎస్ఆర్డీపీలో ఇప్పటికే పలు వంతెనలు, అండర్ పాస్లు, ఆర్యూబీలు అందుబాటులోకి వచ్చాయి. ఎల్బీనగర్ చౌరస్తాలో కుడివైపు అండర్పాస్ నిర్మాణ పనులు ఈ నెలలో పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు.