తైవాన్ కంపెనీలకు ప్రత్యేక పారిశ్రామిక పార్క్
ABN , First Publish Date - 2022-11-12T03:21:31+05:30 IST
రాష్ట్రంలో తైవాన్ కంపెనీలన్నీ ఒకేచోట ఏర్పాటు చేసేందుకు తెలంగాణ - తైవాన్ పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు.
వివిధ రంగాల్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు: కేటీఆర్
హైదరాబాద్, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో తైవాన్ కంపెనీలన్నీ ఒకేచోట ఏర్పాటు చేసేందుకు తెలంగాణ - తైవాన్ పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. పరిశ్రమలకు నిర్దిష్ట కాలవ్యవధిలో అనుమతులు ఇచ్చేందుకు టీఎస్ ఐపాస్ లాంటి విప్లవాత్మక విధానం అమలు చేస్తున్నామని, దీంతో కేవలం 15 రోజుల్లోపే అనుమతులు పొందవచ్చని పేర్కొన్నారు. హైదరాబాద్ - తైవాన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలకా్ట్రనిక్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (టీమా), తైపీ ఎకనామిక్ అండ్ కల్చరల్ సెంటర్ (టీఈసీసీ) బృందం ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రగతిభవన్లో సమావేశం అయ్యారు.
టీమా చైర్మన్ రిచర్డ్ లీ నేతృత్వంలో ప్రతినిధుల బృందం ఇందులో పాల్గొంది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హెల్త్కేర్, లైఫ్ సైన్సెస్, ఆటోమొబైల్స్, డిఫెన్స్, ఏరోస్పేస్, టెక్ ఇన్నోవేషన్ రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణలో విస్తృత అవకాశాలున్నాయని, పెట్టుబడులకు సిద్ధమైతే ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. ఈ సరదర్భంగా రిచర్డ్ లీ మాట్లాడుతూ.. తెలంగాణలో పెట్టుబడుల అనుకూల విధానం నచ్చిందని, పెట్టుబడులపై త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.