HYD : నమ్మినవారే నయవంచకులు.. కీచకులుగా మారుతున్నారు..!
ABN , First Publish Date - 2022-03-18T14:48:33+05:30 IST
సొంతవారు.. తెలిసిన వారు అమాయకుల, చిన్నారుల జీవితాలను చీకటి మయం చేస్తున్నారు...
- 98 శాతం కేసుల్లో వారే
- పోలీసుల విచారణలో వెలుగులోకి..
సొంతవారు.. తెలిసిన వారు అమాయకుల, చిన్నారుల జీవితాలను చీకటి మయం చేస్తున్నారు. మనవాళ్లే కదా అని దగ్గరకు వెళ్తే చిన్నారులను చిదిమేస్తున్నారు. గురువారం వెలుగు చూసిన పలు ఘటనలు బంధాలను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి.
హైదరాబాద్ సిటీ : యువతులు, చిన్నారులపై ఆకృత్యాలు... లైంగికదాడులకు సంబంధించిన కేసుల దర్యాప్తులో ఆశ్చర్యకరమైన వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. అలాంటి దారుణాలు తెలిసిన వారి పనేనని ప్రాథమిక విచారణలోనే వెల్లడవుతోంది. గతేడాది హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిఽధుల్లో బాలికలు, యువతులను మోసం చేసినట్లు 1061 కేసులు నమోదయ్యాయి. వాటిలో తెలియని వారు లైంగిక దాడి చేసినట్లు వచ్చిన ఫిర్యాదులు కేవలం 20 మాత్రమే. అంటే 98శాతం దాడులు తెలిసిన వారే చేస్తున్నారు. 2020తో పోలిస్తే 2021లో ఇలాంటి లైంగిక దాడుల ఘటనలు విపరీతంగా పెరిగాయి.
భార్యపై కోపం.. కొడుకుకు చిత్రహింసలు
భార్య మీద కోపంతో ఓ తండ్రి పదేళ్ల కొడునును చిత్రహింసలకు గురి చేసిన ఘటన సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. పోలీసులు, బాలుడి తల్లి తెలిపిన వివరాల మేరకు సరూర్నగర్ పరిధి డాక్టర్స్ కాలనీకి చెందిన సంతోష్ కుమార్ (న్యాయవాది) కుటుంబ తగాదాల నేపథ్యంలో నాలుగేళ్లుగా భార్యతో వేరుగా ఉంటున్నాడు. ఇద్దరు కుమారులు ఉండగా, నాలుగు నెలల క్రితం కోర్టు ఆదేశాల మేరకు పిల్లలను తండ్రికి అప్పగించారు. భార్యమీద కోపంతో అప్పటి నుంచి పెద్దకుమారుడిని చిత్రహింసలకు గురి చేశాడు. దీంతో అతను ఇంటి నుంచి పారిపోయి తల్లి వద్దకు చేరాడు. తండ్రి పెడుతున్న బాధలు, గాయాలు చూపించాడు. దీంతో ఆమె బాలుడిని ఆస్పత్రికి తరలించి, సరూర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కన్న కూతురిపై అత్యాచారం
కంటికి రెప్పగా కాపాడాల్సిన కన్న కూతురిపై ఓ కామాంధుడు కొన్ని రోజులుగా అత్యాచారం చేస్తున్న సంఘటన వెలుగుచూసింది. గురువారం బేగంపేట ఏసీపీ నరేష్ రెడ్డి, బోయినపల్లి సీఐ రవికుమార్ వివరాలు వెల్లడించారు. బతుకుదెరువుకోసం నగరానికి వలసవచ్చిన ఓ వ్యక్తి(32) చిన్నచిన్న పనులు చేసుకుంటూ భార్యతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. వీరికి ఓ కుమార్తె. అయితే భార్యాభర్తల మధ్య గొడవలు రావడంతో విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకుని ఆమెతో కలిసి ఉంటున్నాడు. మొదటి భార్య కుమార్తె ప్రస్తుతం తండ్రితో ఉంటోంది. కొంతకాలంగా అతను కుమార్తెపై అత్యాచారం చేస్తున్నాడు. మంగళవారం రాత్రి రెండో భార్య గమనించి అతన్ని నిలదీసింది. దీంతో ఇంట్లోనుంచి వెళ్లిపోయిన అతనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గురువారం నిందితుడిని అరెస్టుచేశారు. బాలికను భరోసా కేంద్రానికి తరలించారు. నిందితుడు నేరాన్ని అంగీకరించడంతో రిమాండ్కు తరలించారు.
మరదలిపై కన్నేసి, నగ్న వీడియో తీసి..
అతను తన మరదలిపై (వదిన చెల్లెలు) కన్నేశాడు. ఆమె స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో తీశాడు. దాన్ని అడ్డం పెట్టుకొని న్యూడ్ వీడియో కాల్స్ చేయాలంటూ బెదిరిస్తున్న అతడిని రాచకొండ పోలీసులు అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. నగరంలో ఓ యువతికి ఇటీవలే గుర్తుతెలియని వ్యక్తి ఆమె స్నానం చేస్తున్న ఫొటోను వాట్సాప్లో పంపాడు. ఆ తర్వాత ఆమెకు ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు. ‘స్నానం చేస్తున్న వీడియో నా వద్ద ఉంది.. నగ్నంగా వీడియో కాల్స్ చేసి నాతో మాట్లాడాలి. లేకపోతే ఆ వీడియోను బయటపెడతా’ అని నిందితుడు హెచ్చరించాడు. అతని వేధింపులు భరించలేక బాధితురాలు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఇన్స్పెక్టర్ రాము రంగంలోకి దిగి, సాక్ష్యాధారాలను సేకరించారు. నిందితుడిని బాధితురాలి అక్కకు మరిదిగా గుర్తించారు. కేసు దర్యాప్తు చేసి నిందితుడిని కటకటాల వెనక్కి పంపారు.