హైదరాబాద్‌ - విజయవాడ రహదారిపై కేంద్ర మంత్రి గడ్కరీ సమీక్ష

ABN , First Publish Date - 2022-03-16T09:16:53+05:30 IST

హైదరాబాద్‌-విజయవాడ రహదారి విస్తరణ స్థితిపై మంగళవారం కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ సమీక్షించారు.

హైదరాబాద్‌ - విజయవాడ రహదారిపై కేంద్ర మంత్రి గడ్కరీ సమీక్ష

న్యూఢిల్లీ, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌-విజయవాడ రహదారి విస్తరణ స్థితిపై మంగళవారం కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ సమీక్షించారు. కాంట్రాక్టు సంస్థ జీఎంఆర్‌ ఆర్బిట్రేషన్‌కు వెళ్లిన నేపథ్యంలో రహదారి నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలంటూ పలుమార్లు కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి వినతి పత్రాలు సమర్పించారు. దీంతో గడ్కరీ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో వెంకట్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. సమావేశానంతరం వెంకట్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ... ఒప్పందం ప్రకారం కాంట్రాక్టు సంస్థ ఆరులైన్లకు రోడ్డును విస్తరించాలని, కానీ నష్టం వచ్చిందని చెబుతూ 6 లైన్ల నిర్మాణం చేయడం లేదని అన్నారు. ఈ రహదారిపై ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ విషయమై జీఎంఆర్‌ సంస్థను కేంద్ర మంత్రి గడ్కరీ హెచ్చరించారని వెల్లడించారు. 

Updated Date - 2022-03-16T09:16:53+05:30 IST