వేగంగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు
ABN , First Publish Date - 2022-07-19T05:12:11+05:30 IST
వేగంగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు
అటానమస్ సంస్థగా తీర్చిదిద్దుతాం
16 అంతస్థుల్లో ఆస్పత్రి భవనం
దసరా నుంచి పనులు మరింత వేగవంతం
మంత్రి హరీ్షరావు వెల్లడి
హనుమకొండ అర్బన్, జూలై 18 : ఉత్తర తెలంగాణ ప్రజల సౌకర్యార్ధం వరంగల్ జిల్లా కేంద్రంలోని సెంట్రల్ జైలు స్థలంలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు మరింత వేగవంతం చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీ్షరావు వెల్లడించారు. ఆస్పత్రి నిర్మాణ పనులను మంత్రులు హరీ్షరావు, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్లు సోమవారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి హరీ్షరావు మాట్లాడుతూ.. ఉత్తర తెలంగాణకే ఈ ఆస్పత్రి ఆరోగ్య ప్రదాయినిగా నిలుస్తుందన్నారు. ప్రస్తుతం ర్యాంప్ ఫౌండేషన్ పనులు జరుగుతున్నాయని, మరో రెండు మూడు వారాల్లో మొదటి స్లాబ్ పడుతుందన్నారు. 24 అంతస్థులలో రూ.1200 కోట్లతో నిర్మితమవుతున్న ఈ ఆస్పత్రిని సంవత్సరం లోపు పూర్తి చేయాలని, ఆ తర్వాత రెండు మూడు నెలల్లో పరికరాలు, సిబ్బంది నియామకం చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలనేదే ముఖ్యమంత్రి లక్ష్యమన్నారు. 56 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ ఆస్పత్రి కోసం ఎయిర్ఫోర్స్, పర్యావరణ, ఫైర్ తదితర శాఖల అనుమతులు పొందామన్నారు. ప్రస్తుతం 700 మంది కార్మికులతో పనులు సాగుతున్నాయని, త్వరలో 2500 మంది కార్మికులతో మూడు షిప్టులలో పనులు చేయించాలని ఇంజనీరింగ్ సంస్థను ఆదేశించినట్లు పేర్కొన్నారు. దసరా తర్వాత పనులను మరింత వేగవంతం చేస్తామని నిర్మాణ సంస్థ అంగీకరించిందన్నారు. అన్ని రకాల సేవలు ఇక మీదట వరంగల్లో అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. ఆస్పత్రిని అటానమ్సగా నిర్మించి నాణ్యమైన వైద్య సేవలతో పాటు బోధించబోతున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తదితరులు పాల్గొన్నారు.