రాష్ట్ర వినియోగదారుల ఫోరం సభ్యుడి తొలగింపు ఆదేశాలను కొట్టేసిన హైకోర్టు
ABN , First Publish Date - 2022-11-16T03:58:44+05:30 IST
హైదరాబాద్, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): ఎలాంటి కారణాలను తెలపకుండా పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టేసింది.
నాలుగు వారాల్లో సరైన నిర్ణయం తీసుకోవాలని ఆదేశం
హైదరాబాద్, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): ఎలాంటి కారణాలను తెలపకుండా పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టేసింది. రాష్ట్ర వినియోగదారుల ఫోరం జ్యుడీషియల్ సభ్యుడు కొల్ల రంగారావును పదవి నుంచి తొలగిస్తూ రాష్ట్ర పౌర సరఫరా, వినియోగదారుల వ్యవహారాలశాఖ జీవో 49ను జారీ చేసింది. ఎలాంటి కారణాలు వివరించకుండా తనను పదవి తొలగించడంపై రంగారావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై జస్టిస్ పీ. నవీన్రావు, జస్టిస్ జే. శ్రీనివాసరావు నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. కారణాలు వివరించకుండా, పిటిషనర్ వాదనను పరిగణనలోకి తీసుకోకుండా పదవి నుంచి తొలగించడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇంతకుముందు ఇదే తరహా తొలగింపు ఆదేశాలను హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టేసిందని గుర్తుచేశారు. వాదనలు విన్న ధర్మాసనం సదరు తొలగింపు జీవోను కొట్టేసింది. అన్ని రకాల కారణాలను వివరిస్తూ సరైన ఆదేశాలను జారీ చేయాలని, దీనిపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.