Bail: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అల్లర్ల కేసులో బెయిల్ మంజూరు
ABN , First Publish Date - 2022-08-01T21:41:12+05:30 IST
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అల్లర్ల కేసులో ఆర్మీ అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టు బెయిల్ (Bail) మంజూరు చేసింది.
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అల్లర్ల కేసులో ఆర్మీ అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టు బెయిల్ (Bail) మంజూరు చేసింది. ఆర్మీ అభ్యర్థుల తరపున టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. 16 మంది ఆర్మీ అభ్యర్థులకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చారు. రూ.20 వేలు, 2 షూరిటీలు సమర్పించాలని హైకోర్టు (High Court) ఆదేశించింది. ‘‘అగ్నిపథ్’’ను వ్యతిరేకిస్తూ.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో బోగీలకు నిప్పుపెట్టి, రైల్వే ఆస్తులను ఆర్మీ అభ్యర్థుల నష్టపరిచారు. ఈ ఘటనలో పలువురి అరెస్ట్ చేశారు.
సైన్యంలో నియామకాల కోసం కేంద్రం కొత్తగా తెచ్చిన ‘అగ్నిపథ్’పై (Agnipath) ఆర్మీ అభ్యర్థులు ఆగ్రహంతో రగిలిపోయారు. ఆర్మీర్యాలీల్లో అర్హత సాధించి.. వైద్యపరీక్షలు కూడా పూర్తిచేసుకుని పరీక్షలు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న వేళ కొత్త పథకాన్ని ప్రకటించడంతో అభ్యర్థులు మండిపడ్డారు. పక్కా ప్రణాళిక ప్రకారం దాదాపు రెండు వేల మంది సికింద్రాబాద్ (Secunderabad) రైల్వే స్టేషన్లోకి ప్రవేశించి పలు రైళ్లను ధ్వంసం చేశారు. ఇంజన్లు, బోగీలకు నిప్పు పెట్టారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు. వారిని అదుపులోకి తెచ్చేందుకు ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లు జరిపిన కాల్పుల్లో.. వరంగల్ జిల్లాకు చెందిన యువకుడు రాకేష్ (Warangal Rakesh) మరణించగా, పలువురికి గాయాలయ్యాయి.