గవర్నర్‌ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి

ABN , First Publish Date - 2022-09-17T10:34:49+05:30 IST

గవర్నర్‌ రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాలని, అందుకు భిన్నంగా బీజేపీ నాయకురాలిగా ప్రవర్తిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు.

గవర్నర్‌ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని

ఖమ్మం/కొత్తగూడెం, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): గవర్నర్‌ రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాలని, అందుకు భిన్నంగా బీజేపీ నాయకురాలిగా ప్రవర్తిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టుల చరిత్ర మరువలేనిదని, ఆ చరిత్రను బీజేపీ వక్రీకరిస్తోందని ఆరోపించారు. శుక్రవారం సీపీఐ ఖమ్మం జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ విలీనంపై గవర్నర్‌ తమిళసై తమతో చర్చకు రాకపోతే రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. బీజేపీకి గవర్నర్‌ వంతపాడుతున్నారని కూనంనేని పేర్కొన్నారు. తెలంగాణ విలీన ఉద్యమంలో బీజేపీకి ఎలాంటి పాత్ర లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో సీపీఎం, సీపీఐలు ఐక్యంగా పోటీచేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 25 అసెంబ్లీ స్థానాల్లో పోటీకి తమ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పారు. తమతో కలిసివచ్చే పార్టీల మధ్య పొత్తులు కుదిరిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. టీఆర్‌ఎస్‌తో కలిసి ప్రయాణం సాగించినా, తమ విధానాలు, ప్రజా పోరాటాల్లో రాజీలేదని తెలిపారు. రాబోయే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ ఒంటరిగానే పోటీచేస్తుందని స్పష్టంచేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా భద్రాద్రి జిల్లాకు వచ్చిన కూనంనేనికి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కొత్తగూడెం క్లబ్‌లో అభినందన సభ ఏర్పాటు చేశారు.

Updated Date - 2022-09-17T10:34:49+05:30 IST