బంగారు భారత్ కేసీఆర్తోనే సాధ్యం
ABN , First Publish Date - 2022-09-10T08:19:44+05:30 IST
బంగారు భారత్ కేసీఆర్తోనే సాధ్యమవుతుంది. మోదీ పాలనలో దేశం వందేళ్లు వెనక్కి వెళ్లింది.
జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ రావాలన్నది దేశ ప్రజలందరి కోరిక
మీడియాతో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు
హైదరాబాద్, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి) : ‘‘బంగారు భారత్ కేసీఆర్తోనే సాధ్యమవుతుంది. మోదీ పాలనలో దేశం వందేళ్లు వెనక్కి వెళ్లింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తరహాలోనే దేశం కోసం కేసీఆర్ ప్రత్యేకంగా ఉద్యమం చేపట్టాల్సిన సమయం ఆసన్నమైంది. జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ రావాలన్నది దేశ ప్రజలందరి కోరిక’’ అని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు అభిప్రాయపడ్డారు. తెలంగాణ భవన్లో శుక్రవారం టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మీడియాతో మాట్లాడారు. తొలుత ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మాట్లాడుతూ మోదీ పాలనలో ఏ వర్గానికీ మేలు జరగలేదని ధ్వజమెత్తారు. తెలంగాణను అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న కేసీఆర్.. జాతీయ స్థాయి రాజకీయాల్లోకి వెళ్లి దేశాన్ని బాగుపర్చాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు దేశ వ్యాప్తంగా అమలు కావాల్సిందేనని అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమైందని, రాహుల్ పాదయాత్రకు స్పందన లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వరంగ సంస్థల బలోపేతానికి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అన్నారు. కార్మిక వర్గం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని ముక్త కంఠంతో కోరుకుంటోందని తెలిపారు. దేశంలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఆరూరి రమేష్ అన్నారు. దౌర్జన్యాల నుంచి దేశాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని, అందుకు కేసీఆర్ తక్షణం జాతీయ రాజకీయాల్లోకి రావాలని అభిప్రాయపడ్డారు. అసాధారణ వనరులున్న దేశానికి కేసీఆర్ వంటి తెలివితేటలున్న నాయకుడు కావాలని ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు. జాతి సంపదను పేదలకు పంచిపెట్టాలన్నా, దేశవ్యాప్తంగా రైతులకు ఉచిత విద్యుత్తు అందాలన్నా.. కేసీఆర్తోనే సాధ్యమవుతుందని చెప్పారు. నాడు తెలంగాణ కోసం కేసీఆర్ కొట్లాడారని, నేడు దేశ పునర్నిర్మాణం కోసం సంకల్పం తీసుకున్నారని వివరించారు. సమావేశంలో మాగంటి గోపీనాథ్, గువ్వల బాలరాజు, మాలోతు కవిత, లింగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఇది చారిత్రక అవసరం
నల్లగొండ: సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలన్నది దేశ ప్రజలందరి కోరికని, ఇది చారిత్రక అవసరమని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. నల్లగొండలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అభివృద్ధిలో దూసుకెళ్తున్న తెలంగాణను అడ్డుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. మత విద్వేషాలను రెచ్చగొట్టి.. దేశం పరువు తీసేలా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఇదే క్రమంలో చుక్కాని లేని నావలా కాంగ్రెస్ పార్టీ తయారైందని వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యానే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లబోతున్నారని స్పష్టం చేశారు. భరతమాత కోసం త్యాగాలు చేసేందుకు, కేసీఆర్ నాయకత్వంలో పనిచేసేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.