అలయ్ బలయ్లో సరదా సన్నివేశం.. చిరు సెల్ఫీలు ఆపితేనే ప్రసంగిస్తానన్న గరికపాటి..
ABN , First Publish Date - 2022-10-06T19:54:32+05:30 IST
నేడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో అలయ్ బలయ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో
హైదరాబాద్ : నేడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో అలయ్ బలయ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు సహా పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. అయితే గరికపాటి నరసింహారావు ప్రసంగం మెదలు పెట్టిన సమయంలో.. చిరంజీవితో అభిమానులు సెల్ఫీలు దిగుతున్నారు. అయితే చిరంజీవి సెల్ఫీలు ఆపితేనే తాను ప్రసంగిస్తానని.. లేకుంటే ప్రసంగం ఆపేసి.. వెళ్ళిపోతానంటూ గరికపాటి నరసింహారావు హెచ్చరించారు. దీంతో సెల్ఫీలు ఆపి వచ్చి.. చిరంజీవి తన సీటులో కూర్చున్నారు.
హైదరాబాద్, నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో గురువారం అలయ్.. బలయ్ (Alai Balai) కార్యక్రమం గ్రాండ్గా మొదలైంది. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ (bandaru dattatreya) కుమార్తె బండారు విజయలక్ష్మి (Vijayalakshmi) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. తెలంగాణలో దసరా పండుగను పురస్కరించుకుని, విజయదశమి తర్వాత రోజు బంధుమిత్రులను కలుసుకున్న సందర్భంగా పరస్పర ఆత్మీయాభిమానాలతో.. ఆలింగనం చేసుకుంటూ ‘అలయ్ బలయ్’ చెప్పుకుంటారు. తెలంగాణ సంస్కృతి, వారసత్వానికి అద్దం పట్టేలా జరిగే ఈ కార్యక్రమాన్ని బీజేపీ నేత బండారు దత్తాత్రేయ ప్రతి ఏటా గ్రాండ్గా నిర్వహిస్తారనే విషయం తెలిసిందే.
రాజకీయాలకు అతీతంగా జరిగే ఈ కార్యక్రమానికి.. వివిధ పార్టీల నేతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆయన ఆహ్వానిస్తుంటారు. ఈ సంవత్సరం ఈ కార్యక్రమానికి కేరళ గవర్నర్ అరిఫ్ మహమ్మద్, మెగాస్టార్ చిరంజీవి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, బీజేపీ నేతలు రామ్ చందర్ రావు, కపిలవాయి దిలీప్ కుమార్, కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు, సీపీఐ నేతలు నారాయణ, చాడ వెంకట్ రెడ్డి, రామకృష్ణ, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగమయ్యేందుకు ఎప్పటి నుండో వేచి చూస్తున్నానంటూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన చిరంజీవి.. డప్పుకొడుతూ అందరిలో హుషారును నింపారు.