ముందు మీ వాగ్దానాలను నెరవేర్చండి!

ABN , First Publish Date - 2022-09-13T10:01:59+05:30 IST

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుగా తాను ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి, ఆ తర్వాత దేశ రాజకీయాల గురించి మాట్లాడాలని వైఎ్‌సఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు.

ముందు మీ వాగ్దానాలను నెరవేర్చండి!

దేశ రాజకీయాల గురించి ఆ తర్వాత మాట్లాడండి

సీఎం కేసీఆర్‌పై వైఎస్‌ షర్మిల విమర్శలు

మహబూబ్‌నగర్‌/అడ్డాకుల, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుగా తాను ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి, ఆ తర్వాత దేశ రాజకీయాల గురించి మాట్లాడాలని వైఎ్‌సఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర సోమవారానికి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని దేవరకద్ర మండలానికి చేరుకుంది. ఇక్కడి వెంకంపల్లి, వెంకటగిరి, కౌకుంట్ల, ఇస్రంపల్లి అడ్డాకుల మండలంలోని రాచాల వరకూ ఆమె పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వెంటగిరిలో పత్తి తీస్తున్న కూలీలతో ముచ్చటించారు. వారితో కలిసి పత్తితీసి ఉత్సాహపరిచారు. సాయంత్రం రాచాల వద్ద మాట-ముచ్చట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై పదునైన విమర్శలతో షర్మిల విరుచుకుపడ్డారు. ‘‘బంగారం లాంటి తెలంగాణను ఎనిమిదేళ్లలో నాశనం చేసిన సీఎం కేసీఆర్‌, ఇప్పుడు దేశాన్ని ఏలుతానని బయలుదేరారు. తల్లికి అన్నంపెట్టనోడు చిన్నమ్మకి బంగారు గాజులు చేయిస్తానన్నట్లుంది సీఎం వ్యవహారం. రుణమాఫీ సహా రైతులకివ్వాల్సిన అన్ని రకాల పథకాలను రద్దుచేసి, కేవలం రూ.5 వేలు ఇస్తున్నారు. అయినా సరే.. రైతులను కోటీశ్వరులను చేశానని, కార్లలో తిరుగుతున్నారని అబద్ధాలు చెబుతూ మోసం చేస్తున్నారు. దళితులకు మూడెకరాల భూమి మొదలుకొని, దళితబంధు వరకు అన్నింటా మోసమే. దివంగత సీఎం వైఎ్‌సఆర్‌ 46 లక్షల ఇందిరమ్మ ఇళ్లు పేదలకు నిర్మిస్తే, టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పేరుతో మోసం చేసింది. పేదల సమస్యలు తీర్చేందుకే నేను రాజకీయపార్టీ పెట్టాను. వచ్చే ఎన్నికల్లో నన్ను ఆశీర్వదిస్తే రాజన్న సంక్షేమపాలన తెస్తాను’’ అని షర్మిల హామీ అన్నారు.  

Updated Date - 2022-09-13T10:01:59+05:30 IST